close
Choose your channels

దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. పలు రాష్ట్రాల్లో ఇలా..

Wednesday, March 24, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలో ఎన్ని కేసులైతే నమోదయ్యాయో.. తిరిగి అన్ని కేసులు నమోదవుతుండటం గమనార్హం. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా 40,715 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. 29,785 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 199 మంది కరోనాతో కన్నుమూశారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలియజేసింది. దేశంలో కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకూ 1 కోటీ 16 లక్షల 86 వేల 796 మంది కరోనా బారిన పడినట్టు వెల్లడింది. ప్రస్తుతం దేశంలో 3,45,377 యాక్టివ్ కేసులున్నట్టు వెల్లడించింది. కాగా.. కరోనా కారణంగా ఇప్పటివరకూ మొత్తం 1,60,166 మంది కన్నుమూశారు.

మహారాష్ట్రలో మరింత విజృంభణ..

దేశం మొత్తమ్మీద మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మంగళవారం మహారాష్ట్రలో 28,699 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 25,33,026కి చేరుకుంది. కరోనా కారణంగా నిన్న ఒక్కరోజే 132 మంది మృతి చెందారు. కాగా.. మొత్తం మరణాల సంఖ్య 53,589కు చేరుకుంది. ప్రస్తుతం మహారాష్ట్రలో 2,30,641 యాక్టివ్ కేసులున్నాయి. 22,47,495 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోవడంతో ముంబైలో బీఎంసీ అధికారులు హోళీ వేడుకలపై నిషేధం విధించారు. ఇక మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసుల తీవ్రత మహారాష్ట్ర స్థాయిలో లేకున్నా తిరిగి వేలల్లో నమోదవుతోంది.

మరికొన్ని రాష్ట్రాల్లోనూ...

మరికొన్ని రాష్ట్రాల్లోనూ కేసుల తీవ్రత బాగానే ఉంది. మంగళవారం పంజాబ్‌లో 2,254 కరోనా కేసులు నమోదవగా.. కరోనా కారణంగా 53 మంది మృతి చెందారు. కర్ణాటకలో 2010 కేసులు నమోదవగా.. ఐదుగురు మృతి చెందారు. కేరళలో 1985 కేసులు నమోదవగా.. 10 మంది మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్‌లో 1910 కేసులు నమోదవగా.. 20 మంది మృతి చెందారు. ఇక గుజరాత్‌లో 1730 కేసులు నమోదవగా.. నలుగురు మృతి చెందారు. కాగా.. ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడినవారందరికీ టీకా వేయనున్నారని కేంద్ర మంత్రి జవదేకర్ వెల్లడించారు. సోమవారం దేశంలో 32 లక్షల మందికి టీకా వేసినట్టు తెలిపారు. వ్యాక్సినేషన్ మరింతగా పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నదని ఇప్పటివరకూ 4 కోట్ల 85 లక్షలమంది టీకా వేయించుకున్నారని తెలిపారు. 80 లక్షల మంది రెండవ డోసు టీకా తీసుకున్నారని పేర్కొన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.