దేశ వ్యాప్తంగా ప్రారంభమైన టీకా డ్రైరన్..

  • IndiaGlitz, [Saturday,January 02 2021]

దేశ వ్యాప్తంగా కరోనా టీకా డ్రైరన్ శనివారం ప్రారంభమైంది. కరోనా మహమ్మారిని నిరోధించడంలో భాగంగా శుక్రవారం ఆస్ట్రాజెనెకా కంపెనీ, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ (కొవిషీల్డ్‌)కు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేడు డ్రైరన్‌కు దేశ వ్యాప్తంగా 116 జిల్లాల్లోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ నేడు ప్రారంభమైంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌కు ముందు, తరువాత ప్రజలు, ఆరోగ్య సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైరన్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ డ్రైరన్‌లో నేరుగా ఒక్క టీకా ఇవ్వడం మినహా మిగిలిన అన్ని ప్రక్రియలనూ పర్యవేక్షిస్తారు.

కాగా.. టీకా డ్రైరన్ కోసం మూడు గదులను ఏర్పాటు చేశారు. మొదటి గదిలో టీకా కోసం వచ్చిన వారి వివరాలను నమోదు చేస్తారు. రెండవ గదిలో వ్యక్తి ప్రాథమిక సమాచారాన్ని నమోదు చేసుకున్న మీదట టీకా వేయడంపై మాక్ డ్రిల్ చేస్తారు. మూడవ గదిలో.. టీకా తీసుకున్న అనంతరం అభ్యర్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయోగశాల గదిలో 30 నిమిషాల పాటు ఉంచుతారు. ఈ 30 నిమిషాల్లో ఎలాంటి అనారోగ్య పరిస్థితులూ తలెత్తకుంటే ఇంటికి పంపించేస్తారు. టీకా కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం వెంటనే అవసరమైన చికిత్సను అందిస్తారు.

ఫైనల్‌గా.. ఈ ప్రక్రియ సాగిన విధానం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా ఒక నివేదిక రూపంలో అందజేస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా కేంద్రం కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో అవసరమైన మార్పులు చేస్తుంది. డ్రై రన్ పూర్తయిన అనంతరం దేశ వ్యాప్తంగా ప్రజానీకానికి టీకా ఇచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లను కేంద్రం చేస్తుంది. మొత్తానికి ఈ వ్యాక్సిన్ ఎంతమేరకు సత్ఫలితాలనిస్తుందో.. కొత్త స్ట్రెయిన్‌పై ప్రభావం చూపుతుందా.. లేదా? అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.