close
Choose your channels

కొవిడ్‌ వ్యాక్సిన్ కొరత.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం

Saturday, May 8, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కొవిడ్‌ టీకా డోసుల కొరత దృష్ట్యా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నేటి(శనివారం) నుంచి కొవిడ్‌ టీకా రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ వరకు కరోనా టీకా మొదటి డోసు ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్ టీకా డోసుల కొరత కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. రెండో డోసు తీసుకోవాల్సిన వారికి సరైన సమయానికి టీకా అందించేందుకే మొదటి డోస్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటి వరకూ రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనే దాదాపు 30 లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు కావాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. డోసుల కొరత కారణంగా పలు మార్లు వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆరోగ్య శాఖ నిలిపివేసింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ తొలి డోసు ప్రక్రియను నిలిపివేస్తూ కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని తాజాగా ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే పలు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద తోపులాట కూడా జరిగింది. తాజాగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేయడంతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ఇలా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిలిపివేస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.