close
Choose your channels

CPI Narayana: మెగా ఫ్యాన్స్ దెబ్బ.. చిరుపై వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నా : సీపీఐ నారాయణ

Wednesday, July 20, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు సీపీఐ నారాయణ. బుధవారం ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన .. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలను భాష దోషంగా పరిగణించాలని.. వీటిని మోగా అభిమానులు మరిచిపోవాలని నారాయణ కోరారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజమని ఆయన అన్నారు. చిరంజీవి గతంలో రాజకీయాల్లో వున్నారని.. అలాంటప్పుడు విమర్శల్ని స్పోర్టివ్‌గా తీసుకోవాలని నారాయణ పేర్కొన్నారు. అయితే తాను చిరంజీవిపై అలాంటి వ్యాఖ్యల్ని చేసి వుండకూడదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. కాపు నాడు, చిరంజీవి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, జగన్‌లు పునరావాస చర్యల్లో విఫలమయ్యారని... ప్రజల దృష్టిని మరల్చడానికి పోలవరం వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు.

కృష్ణను పిలవకుండా చిరు ఎందుకు:

కాగా.. భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు చిరంజీవికి సైతం ఆహ్వానం అందింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి మెగాస్టార్‌ను పిలవడాన్ని సీపీఐ నారాయణ తప్పుబట్టారు. సూపర్‌స్టార్ కృష్ణను పిలవకుండా ఊసరవెల్లి, చిల్లర బేరగాడి లాంటి చిరంజీవిని ఆహ్వానించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పనిలో పనిగా చిరు సోదరుడు పవన్ కల్యాణ్‌పైనా సీపీఐ నారాయణ విమర్శలు చేశారు. పవన్ ఓ మందుపాతర లాంటివాడని.. ఎప్పుడేం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మెగా, జనసేన అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో నారాయణపై విమర్శలు చేశారు.

నారాయణ గడ్డి తింటున్నట్లున్నారు.. అన్నం పెట్టండి : నాగబాబు

తన సోదరులపై చేసిన వ్యాఖ్యలతో స్వయంగా నాగబాబు సైతం రంగంలో దిగారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. వాటిలో ఆయన ఏమన్నారంటే.. ‘‘‘ ఇటీవలి కాలంలో మెగా అభిమానులు మరియు జనసైనికులు కొంత మంది చేసిన తెలివితక్కువ వెర్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన కుర్రాళ్ళకి నేను చెప్పదలుచుకొందేంటంటే ఈ సిపిఐ నారాయణ అనే వ్యక్తి చాలా కాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం ఎండి గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నాడు’’.

‘‘కాబట్టి మన మెగా అభిమానులందరికీ నా హృదయపూర్వక విన్నపం ఏమిటనగా.. దయచేసి వెళ్లి అతనితో గడ్డి తినడం మాన్పించి...కాస్త అన్నం పెట్టండి .. తద్వారా అతను మళ్లీ తెలివి తెచ్చుకుని మనిషిలా ప్రవర్తిస్తాడు’’ అంటూ నాగబాబు ధీటుగా బదులిచ్చారు. జనసైనికులు, మెగా ఫ్యాన్స్, నాగబాబులు రంగంలోకి దిగడంతో నారాయణ దిగిరాక తప్పలేదు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.