న్యాయం కోరుతూ యువకుడి ట్వీట్.. క్షణాల్లో స్పందించిన సీపీ

  • IndiaGlitz, [Thursday,April 22 2021]

తన తల్లిని తండ్రి చంపేందుకు యత్నిస్తున్నాడంటూ ఓ యువకుడు తల్లితో కలిసి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక చందానగర్ ఎస్సై అయితే ఆమెకు పెళ్లయిందనడానికి ప్రూఫ్ ఏంటి? అవి తీసుకుని రమ్మనమని మరీ కోరాడు. దీంతో ప్రూఫ్‌ల కోసం ఇంటికి వెళ్లగా మరోమారు ఆమెపై భర్త దాడికి పాల్పడ్డాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆమెకు పోలీసుల నుంచి నిరాదరణే ఎదురైంది. తల్లితో కలిసి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయిన ఆ యువకుడు ట్విటర్ ద్వారా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. అతని ట్వీట్ చూసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ క్షణాల్లో స్పందించారు.

పలు ట్వీట్‌ల ద్వారా వంశీ అనే యువకుడు.. ‘‘చివరి ప్రయత్నంగా నేనిక్కడ ప్రయత్నిస్తున్నాను. మా నాన్న పి.రమేష్ బాబు.. మా అమ్మ రాజమణిని నాముందే గునపం, కత్తితో చంపేందుకు యత్నించాడు. దీనిపై చందానగర్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 498ఏ, ఐపీసీ 324, ఐపీసీ 307 కింది ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఐపీసీ 307ను తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తున్న మా పెద్దనాన్న పి.జంగయ్య తన ఇన్‌ఫ్లూయెన్స్‌ను ఉపయోగించి తొలగించారు. మానాన్న, ఆయన సోదరులు జంగయ్య, శివకుమార్‌ల నుంచి మాకు థ్రెట్ ఉంది. ఏప్రిల్ 7న ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కానీ ఇంతవరకూ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.

తిరిగి చందానగర్ ఎస్ఐ వెంకటేష్.. మా అమ్మకు పెళ్లి అయ్యిందా? పెళ్లి కార్డు, ఫోటోలు ఉంటే చూపించాలని అడిగారు. కానీ ఆ ఎస్ఐ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఇవేమీ అడగలేదు. కానీ 20 రోజుల తర్వాత మమ్మల్ని ప్రూఫ్స్ అడుగుతున్నారు. దీంతో మా అమ్మ తమ పెళ్లి కార్డు, ఫోటోల కోసం ఈ నెల 20న మా ఇంటికి వెళ్లగా.. మా నాన్న తన సోదరుని కొడుకుతో కలిసి మరోసారి దాడికి పాల్పడ్డాడు. పరిస్థితిని వివరించేందుకు మా అమ్మ పోలీస్ స్టేషన్‌కు వెళితే అధికారులు అసలు పట్టించుకోలేదు. ఇది మాకు చివరి ఆప్షన్.. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. దయచేసి వెంటనే యాక్షన్ తీసుకోండి సర్’’ అని వంశీ ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్.. ‘సర్, మీ కాంటాక్ట్ డీటైల్స్ ఇవ్వగలరా’ అని మెసేజ్ చేశారు.