అరేబియాలో సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. తుపాను అలర్ట్‌

  • IndiaGlitz, [Friday,May 14 2021]

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ నెల 16, 17 తేదీల్లో తుపాను ప్రభావం ఉండే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుపానుకు తౌక్టే అని నామకరణం చేశారు. ఈ పేరును మయన్మార్ సూచించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం 16 నాటికి తుపానుగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాత అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. గుజరాత్‌ పరిసరాల్లో తీరం దాటే అవకాశం ఉంది. రాష్ట్రంపై ప్రభావం ఉండదన్న వాతావరణ నిపుణులు..రాయలసీమకు మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వెల్లడించారు.

Also Read: హైకోర్టు చెప్పినా వినరా? అంబులెన్స్‌లను అడ్డుకున్న పోలీసులు..

ఇప్పటికే ఏర్పడిన ఉత్తర- దక్షిణ ద్రోణి/గాలి విచ్ఛిన్నతి గురువారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమల మీదగా దక్షిణ తమినాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకూ ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. రాగల మూడు రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

రుతు పవనాల రాకకు శుభ సంకేతం

ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుపాను గానూ, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది 18వ తేదీ నాటికి గుజరాత్‌కు చేరుకుంటుందని, అయితే ఎక్కడ తీరం దాటుతుందనే అంచనా చిక్కడం లేదని చెబుతున్నారు.