తాతయ్య ఉండుంటే నేనెప్పుడో హీరో..!

  • IndiaGlitz, [Saturday,June 06 2020]

జూన్-06న మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు జయంతి. 85వ జయంతి కావడంతో ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, నటీనటులు, దర్శకనిర్మాతలు లెజండరీ నిర్మాతను గుర్తు చేసుకున్నారు. ఈయన ఇండస్ట్రీకి చాలా మంది నటీనటులను పరిచయం చేశాడన్న విషయం విదితమే. వాణి శ్రీ, హరీష్‌, మాలాశ్రీ, ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్‌, టబు, ఆర్తి అగర్వాల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి రామానాయుడు లైఫ్ ఇచ్చారు. ఈయనకు సినీ ఇండస్ట్రీనే కాదు రాజకీయాల్లోనూ రాణించారు. తాత జయంతి సందర్భంగా కార్యక్రమంలో దగ్గుబాటి సురేశ్ బాబు రెండో కుమారుడు అభిరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

మిస్ యూ తాత..!

‘తాతయ్య రామానాయుడు బతికుంటే నాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. ఆయన ఉండుంటే నేను ఎప్పుడో హీరో అయ్యేవాడిని. నాకు ఎంతో సపోర్ట్ ఉండేది. నేను తాతను ఎంతో మిస్ అవుతున్నాను. భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ... మానసికంగా ఆయన నాకు దగ్గరగా ఉన్నారనేది నా ఫీలింగ్. తాత ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఒకింత భావోద్వేగానికి లోనవుతూ అభిరామ్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే.. కార్యక్రమంలో అభిరామ్ పక్కనే ఉన్న ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ స్పందించారు. ‘ఏం భయపడొద్దులే అభిరామ్.. నువ్ హీరో అయిపోతావ్ లే..’ అని అభిరామ్ భుజం తట్టారు సి. కళ్యాణ్. కాగా ఈ ఇద్దరి మధ్య ఈ జరిగిన సన్నివేశం ఈ కార్యక్రమానికి హైలైట్ అయ్యింది. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో సినీ పెద్దల భేటీ గురించి మీడియాకు వివరాలు వెల్లడించారు.