close
Choose your channels

బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో పెరుగుతున్న మరణాలు... ఇప్పటి వరకు 9 మంది మృతి

Friday, January 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. జల్‌పాయ్‌గుడి జిల్లా దోహొమోనీ వద్ద గురువారం సాయంత్రం గౌహతి-బికనేర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

రాజస్థాన్‌లోని బికనేర్‌ నుంచి బయల్దేరిన ఈ రైలు పాట్నా మీదుగా అస్సాంలోని గౌహతికి వెళ్తుండగా బెంగాల్‌లోని జల్‌పాయ్‌గుడి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ఘటనలో రైలు బోగీలు ఒకదానిమీదకు ఒకటి ఎక్కాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ, రైల్వే సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో దాదాపు 1000 మంది ప్రయాణికులున్నట్లుగా తెలుస్తోంది.

గ్యాస్‌ కట్టర్ల సాయంతో బోగీలను కట్‌ చేసి ప్రయాణికులను రక్షించేందుకు సహాయక బృందాలు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతిచెందినట్లు రైల్వే తెలిపింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని సిలిగురిలోని నార్త్‌ బెంగాల్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఘటనపై రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించారు.

మరోవైపు ఈ రైలు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ విచారం వ్యక్తం చేశారు. అటు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఆరా తీశారు. అటు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ. లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.