దిశ ఘటన: పవన్‌ కల్యాణ్‌పై సుమన్ ఫైర్

  • IndiaGlitz, [Thursday,December 05 2019]

హైదరాబాద్‌‌లోని శంషాబాద్‌లో చోటుచేసుకున్న ‘దిశ’ హత్య ఉదంతంపై తెలుగు రాష్ట్రాలు మొదలుకుని దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అంతేకాదు.. ఇప్పటికే ఈ వ్యవహారంపై పార్లమెంట్‌లోనూ పెద్ద చర్చే జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఆ నలుగురు కామాంధులను ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రేపిస్ట్‌లను చంపే హక్కు మనకు ఎవరిచ్చారు..? ఎలా చంపుతారు..? చెమ్డాలు ఊడేలా రెండు దెబ్బలేసి వదిలేయాలి.. అవి కూడా గట్టిగానే వేయాలని పిలుపునిచ్చారు. అంటే పవన్.. ఆ నలుగురు కామాంధులను వెనకేసుకుని వస్తున్నారని పలువురు నేతలు, సెలబ్రిటీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు పవన్ లాంటి వారి నోట ఇలాంటి వ్యాఖ్యలే వస్తాయిలెండి.. ఎందుకంటే.. అని తీవ్రస్థాయిలో విరుచకుపడుతున్నారు. ఇప్పటికే పవన్ వ్యాఖ్యలపై మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, పుష్ప శ్రీవాణితో పాటు పలువురు తమదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మీ ఇంట్లో జరిగితే..!

తాజాగా.. సీనియర్ నటుడు సుమన్ రియాక్ట్ అయ్యారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి రెండు దెబ్బలు చాలని పవన్ మాట్లాడటం చాలా దారుణమని వ్యాఖ్యానించారు. దిశలాంటి ఘటనలు వారింట్లో జరిగితే పవన్‌ ఇలాగే అంటారా..? అని ఈ సందర్భంగా సుమన్ సూటి ప్రశ్న సంధించారు. అంతటితో ఆగని సుమన్.. ఇలాంటి ఘటనలపై మాట్లాడేటప్పుడు బాధితుల ఆవేదన అర్థం చేసుకుని మాట్లాడాలని ఒకింత కౌంటరిచ్చారు. దిశ ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. ఈ ఘటనపై యావత్ ప్రపంచం.. నిందింతులను నడిరోడ్డుపై ఉరితీయాల్సిందేనని పట్టుబట్టిన విషయం విదితమే.