బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

  • IndiaGlitz, [Wednesday,August 21 2019]

టాలీవుడ్ సీనియర్ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతోందని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. టీడీపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన యామిని సాధినేని కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఇద్దరూ ఒకేసారి బీజేపీ తీర్తం పుచ్చుకుంటారని వార్తలు వినవచ్చాయి. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని కూడా మీడియాతో పాటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో ట్విట్టర్ వేదికగా పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.

క్లారిటీ ఇచ్చిన దివ్యవాణి

‘నేను బీజేపీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. తుదిశ్వాస వరకూ నేను తెలుగుదేశం పార్టీని వీడేది లేదు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులు. నా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేస్తా. సోషల్ మీడియాలో నేను బీజేపీలో చేరుతున్నా అంటూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను’ అంటూ దివ్యవాణి ట్వీట్ చేశారు.