‘దోశ కింగ్’ గుండెపోటుతో కన్నుమూత
- IndiaGlitz, [Thursday,July 18 2019]
ప్రఖ్యాత హోటల్ శరవణ భవన్ యజమాని రాజగోపాల్ తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. కాగా.. మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన వ్యవహారం కలకలం రేపిన విషయం విదితమే. నేటితో రాజగోపాల్ కథ ముగిసిపోయింది.
ఇదిలా ఉంటే.. హత్య కేసులో దోషిగా తేలి, జీవిత ఖైదు శిక్ష విధించిన నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆయన కోర్టు ఎదుట లొంగిపోవడం జరిగింది. ఈ క్రమంలో రాజగోపాల్ తీవ్ర అనారోగ్యానికి గురికావడం.. మరోవైపు గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం నాడు తుదిశ్వాస విడిచారు.
కక్కుర్తి పడిన దోశకింగ్.. పాపం పండింది!
కాగా.. 1947లో తూత్తుకుడిలో రాజగోపాల్ జన్మించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. కాగా.. ఈయన రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఇద్దరు పిల్లలు కూడా వ్యాపార రంగంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. 1981లో చెన్నైలో తొలిసారి శరవణ భవన్ను స్థాపించిన ఆయన అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ‘దోశ కింగ్’గా మారిపోయారు. ఒక్క చెన్నైలోనే కాకుండా ఈయన తన హోటల్ సామ్రాజ్యాన్ని విదేశాల్లోనూ విస్తరించి ఎక్కడికో ఎదిగిపోయాడు. అయితే ఇంత పేరున్న ఈయన మరింత గుర్తింపు సంపాదించుకోవాలని భావించి ఓ జ్యోతిష్యుడి సలహా మేరకు కక్కుర్తిపడి తన హోటల్లో వివాహితను పెళ్లాడాలని అడగ్గా ఆమె అంగీకరించకపోవడంతో ఆమె భర్తను హత్య చేయించి ఆ తర్వాత వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే ఇక్కడ కథ అడ్డం తిరిగింది. ఆ తర్వాత ఈ వ్యవహారం పోలీసులు, హైకోర్టు, సుప్రీంకోర్టు చుట్టూ తిరిగింది.. ఫైనల్గా రాజగోపాల్ పాపం గురవారం పండింది.