ఎట్టకేలకు వీడిన సస్పెన్స్ .. ఓటీటీలోనే వెంకటేశ్ 'దృశ్యం -2' , ఆకట్టుకుంటోన్న టీజర్

  • IndiaGlitz, [Friday,November 12 2021]

విక్టరీ వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫ్యామిలీ, క్రైమ్, సస్పెన్స్ కథాంశంతో వచ్చిన ఆ సినిమా వెంకటేశ్‌కు ఊరట కలిగించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘‘దృశ్యం 2’’ను సైతం తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే కరోనా, లాక్‌డౌన్‌, తదితర కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా సస్పెన్స్‌కు తెరదించుతూ నవంబర్ 25న ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో ‘‘దృశ్యం 2’’ ప్రీమియర్ కానుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, సతీష్ కురుప్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మీనా, నదియా, నరేష్, కృతిక, ఎస్తేర్ అనిల్ వంటి మొదటి భాగంలో నటించిన నటీనటులే ‘దృశ్యం 2″లోనూ కనిపించనున్నారు. సంపత్ రాజ్, పూర్ణ సీక్వెల్‌లో కొత్త పాత్రలను పోషించారు. మలయాళంలో ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్‌కు కూడా దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. వరుణ్ కేసు గురించి అందరూ మాట్లాడుకోవడంతో టీజర్ ప్రారంభమవుతుంది. గత ఆరేళ్లుగా సాధారణ జీవితం గడుపుతున్న వెంకటేశ్ కుటుంబం మళ్లీ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు వెంకీ మరో మాస్టర్ ప్లాన్ అమలు చేసినట్లుగా టీజర్‌ను బట్టి తెలుస్తోంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి కీలకపాత్ర పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారి వెంకీ హిట్ అందుకున్నాడో లేదో తెలియాలంటూ కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.