close
Choose your channels

దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలివే

Sunday, November 8, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దుబ్బాక ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలివే

ఇటీవలి కాలంలో దుబ్బాక ఉపఎన్నిక రాజకీయంగా దుమ్ము రేపింది. ఈ మధ్యకాలంలో ఇంతటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్నిక మరొకటి లేదనే చెప్పాలి. సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ తరుఫున తమ పార్టీ అభ్యర్థిగా రామలింగారెడ్డి భార్య సుజాతనే రంగంలోకి దింపింది. బీజేపీ నుంచి రఘునందన్‌రావు.. కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి బరిలోకి దిగారు. ఈ మూడు పార్టీలు ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఈ ఉపఎన్నికలో విజయం బూస్ట్ ఇస్తుందని భావించడంతో ఈ ఎన్నిక మరింత కఠినంగా మారింది. నవంబర్ 10న ఈ ఎన్నికకు సంబంధించి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ తరుణంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను పలు సంస్థలు వెల్లడించాయి.

దుబ్బాక ఎగ్జిట్ పోల్ ఫలితాలు..

పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో బీజేపీకి విజయం లభించింది. 47 శాతం ఓట్లతో బీజేపీకి మొదటి స్థానం లభిస్తుందని పొలిటికల్ ల్యాబోరేటరీ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన పొలిటికల్ ల్యాబోరేటరీ ఎగ్జిట్ పోల్‌లో 38 శాతం ఓట్లతో టీఆర్ఎస్‌కు రెండోస్థానం.. 13 శాతం ఓట్లతో కాంగ్రెస్‌‌కు మూడో స్థానం లభించింది.

ఇక థర్డ్ విజన్ రీసెర్చ్ అండ్ సర్వీసెస్ (నాగన్న) ఎగ్జిట్‌ పోల్‌లో టీఆర్ఎస్ విజయం సాధించనున్నట్టు వెల్లడించింది. నాగన్న ఎగ్జిట్ పోల్‌లో 51-54 శాతం ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు తొలిస్థానం లభించనుందని వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌.. 33-36 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలవనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి 8-11 శాతం ఓట్లతో మూడో స్థానం లభించనుంది.

కాగా.. మిషన్‌ చాణక్య ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో బీజేపీకి విజయం లభించనున్నట్టు వెల్లడైంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ 51.82 శాతం ఓట్లతో తొలిస్థానంలో నిలవనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 35.67 శాతం ఓట్లతో రెండోస్థానంలో నిలవనున్నారు. 12.15 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి మూడోస్థానంలో నిలవనున్నారని మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది.

ఇక ఆరా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్లో టీఆర్‌ఎస్‌కు విజయం లభించనుందని వెల్లడైంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత 48.72 శాతం ఓట్లతో తొలిస్థానంలో నిలుస్తారని ఆరా సంస్థ వెల్లడించింది.

44.64 శాతం ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు రెండోస్థానం లభించనుంది. 6.12 శాతం ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డికి మూడోస్థానం లభించనుంది. మొత్తం మీద రెండు సంస్థలు బీజేపీకి విజయం లభిస్తుందని చెప్పగా రెండు సర్వే సంస్థలు టీఆర్ఎస్‌కే విజయమని చెప్పాయి. దుబ్బాకలో ఏ పార్టీ విజయం సాధిస్తుందో కచ్చితంగా ఏ సర్వే సంస్థ చెప్పలేకపోయింది. అయితే తొలి రెండు స్థానాలు మాత్రం టీఆర్ఎస్, బీజేపీవేనని వెల్లడైంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.