పవన్ వీడియో చూసి లోకేశ్పై లోతుగా ఎంక్వయిరీ!
Send us your feedback to audioarticles@vaarta.com
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొత్త కొత్త పార్టీలు, నేతలు పుట్టుకొస్తున్నారు. పార్టీ పేర్లు వినగానే అవునా.. అలాంటి పార్టీ కూడా ఒకటుందా..? అని జనాలు ఆశ్చర్యచకితులవుతున్నారు. గత నెల రోజులుగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్.. మీడియా ముందుకొచ్చి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఆయన్ను ఎందుకు మీడియా హైలెట్ చేస్తోంది..? ఎందుకింతలా పదేపదే చూప్తిస్తోంది? ఆయన వల్ల ఎవరికి నష్టం.. ఎవరికి లాభం..? అనేది ఇక్కడ అప్రస్తుతం.
ఒక రోజు చంద్రబాబు, మరో రోజు జగన్, పవన్ ఇలా అందర్నీ పాల్ వరుసగా టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు పాల్. తాజాగా లోకేశ్ గురించి లోతుగా ఎంక్వయిరీ చేసి తెలుసుకున్నానని అంటూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. అస్సలు లోకేశ్కు మూడు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు.
టీడీపీ అంటే చంద్రబాబు అని చంద్రబాబుది కుటుంబ పార్టీ అని తీవ్ర విమర్శలు గుప్పించారయాన.
పవన్ మాటలతో వీడియో చూశా..
2019 ఎన్నికల్లో కచ్చితంగా ఒంటరిపోరాటం చేయాలని భావించిన పవన్.. అటు అధికార, ఇటు ప్రతిపక్షపార్టీల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షపార్టీ నేతల అవినీతిని సైతం కడిపారేశారాయన. మరీ ముఖ్యంగా ఓ సభలో మంత్రి నారాలోకేశ్ను టార్గెట్ చేసుకుని మాట్లాడిన పవన్.. పంచాయతీ సెక్రటరీగా కూడా లోకేశ్ గెలవరని అని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలుసుకుని తనకు ఎందుకో డౌట్ వచ్చి పవన్ స్పీచ్కు సంబంధించిన వీడియోలు చూసి.. లోకేశ్పై లోతుగా ఎంక్వయిరీ చేశానన్నారు.
మనసులో మాటే బయటికొచ్చింది..
లోకేశ్ స్పీచ్ రెండు మూడు వీడియోల్లో చూసి షాకయ్యానని పాల్ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ‘కులపిచ్చి, మతపిచ్చి..’ అని మాట్లాడిన లోకేశ్ వీడియో చూశాను. ఎస్ నిజమే లోకేశ్ చెప్పేది అక్షరాలా నిజమేనని..లోకేశ్ చాలా మంచోడు. ఆయన మనసులో ఉన్న మాటనే నోటితో చెప్పారంతేనన్నారు. అసలు మాటలు రాని లోకేశ్కు చంద్రబాబు మూడు పదవులు ఎలా కట్టబెట్టారో అర్థం కావట్లేదని పాల్ చెప్పుకొచ్చారు.
పాల్ ఆణిముత్యాలు..!
ఇప్పటికే పలుమార్లు మీడియా ముందుకు.. ఇంటర్వ్యూల్లో పాల్గొన్న కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఏపీకి కాబోయే సీఎం నేను.. నా అసిస్టెంట్గా చంద్రబాబును పెట్టుకుంటాను. పవన్ నాతో బాగా టచ్లో ఉండేవాడు.. తమ్ముడు ఈ మధ్య ఫోన్ చేయట్లేదు. జగన్కు డిపాజిట్లు రావు. అమితాబ్ బచ్చన్ కోమాలోకి వెళితే, నేనే ప్రార్ధనలు చేసి ఆయన్ని బతికించేశానంటాడు కేఏ పాల్. ఏపీ ప్రజలు ప్రజాశాంతి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలుస్తాను.. ఇది రాసిపెట్టుకోండి. కేసీఆర్ నాకు మిత్రుడే. దేశాలన్నీ తిరిగేశా.. ట్రంప్ను మొదలుకుని మోదీ వరకు అందర్నీ నేనే గెలిపించా. నేను గెలిస్తే ఒక్కో నియోజకవర్గానికి వంద కోట్లిస్తా.. ఓడిపోతే పైసా కూడా ఇవ్వను. ఆంధ్రప్రదేశ్లో నాకు ఆల్రెడీ 70 సీట్లు ఖాయమైపోయాయి. ఎన్నికల కంటే ముందు నేను గెలిచేశాను. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ, ఒరిస్సాలో పాల్ గారి ప్రజాశాంతి పార్టీకి ఏకంగా 20 శాతం ఓటు బ్యాంకు వుంది" అని చాలా ఆణిముత్యాలే పాల్ నోటి నుంచి వచ్చాయి.
మొత్తానికి చూస్తే క్రైస్తవ బోధకుడిగా ఉన్న పాల్.. ఎస్సీ, ఎస్టీ ఓట్ల కోసం చాలా తాపత్రయపడుతున్నారని టాక్ నడుస్తోంది. ముఖ్యంగా క్రైస్తవులు ఓట్లు కొల్లగొట్టడానికే కొందరు పాల్ను రంగంలోకి దించారనే వార్తలు వినవస్తున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో పాల్ ప్రభావం ఎంత..? నిజంగానే పాల్ పోటీ చేస్తారా..? ఆయన పోటీ చేస్తే పరిస్థితేంటి..? ఇలాంటి సందేహాలకు సమాధానాలు దొరకాలంటే ఎన్నికల ముందువరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.