close
Choose your channels

రాజకీయ కురువృద్ధుడు.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

Saturday, December 4, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజకీయ కురువృద్ధుడు.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. శనివారం ఉదయం పల్స్, బీపీ పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ స్టార్ హాస్పిటల్‌లో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ రోశయ్య తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌, పీసీసీ చీఫ్‌గా అన్ని రకాల హోదాల్లోనూ పనిచేశారు. ఉమ్మడి ఏపీలో పలు కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన రోశయ్య.. సుదీర్ఘకాలం ఆర్థికమంత్రిగా పనిచేసి రికార్డుల్లోకెక్కారు. మొత్తం 16 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.

1933, జూలై 4న గుంటూరు జిల్లాలోని వేమూరులో రోశయ్య జన్మించారు. స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఎన్జీ రంగా శిష్యుడిగా ఆయన నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తితో కాంగ్రెస్‌‌లో చేరిన ఆయన తుదిశ్వాస విడిచే వరకు ఆ పార్టీలోనే కొనసాగారు. 1968లో తొలిసారిగా శాసన మండలికి ఎన్నికైన రోశయ్య... 1968, 74, 80లో వరుసగా కౌన్సిల్‌కు ప్రాతినిథ్యం వహించారు. 1998లో నరసరావు పేట లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 2004లో చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1995- 97 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.

ఏడుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా:

1979లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో తొలిసారి మంత్రిగా బాధ్యలు చేపట్టారు.
1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు
1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ
1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణా, విద్యుత్తు శాఖలు
1991లో నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు
2004, 2009లో వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2009 సెప్టెంబర్ 2న అప్పటి సీఎం వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ఉమ్మడి ఏపీకి 15వ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2009, సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు చేపట్టి.. 2016 ఆగస్టు 30 వరకూ సేవలు అందించారు. అనంతరం వయోభారంతో రాజకీయాలకు దూరమైన ఆయన.. ఇంటికే పరిమితమయ్యారు. రోశయ్య మరణంతో ఒక రాజకీయ దురుంధరుడిని తెలుగు నేల కోల్పోయినట్లయ్యింది. ఆమన మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.