ఒకే రోజున తండ్రీ కొడుకుల సినిమాలు

  • IndiaGlitz, [Wednesday,January 31 2018]

చిత్ర ప‌రిశ్ర‌మ అంటేనే చిత్ర‌విచిత్రాల‌కు కొలువు. అలాంటి ప‌రిశ్ర‌మ‌లో.. ఒక్కో సంద‌ర్భంలో ఒకే కుటుంబానికి చెందిన వ్య‌క్తుల సినిమాలు ఒకే రోజున బ‌రిలోకి దిగొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితే ఓ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌, ఆయ‌న త‌న‌యుడు మ‌ధ్య చోటు చేసుకోనుంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ద‌శాబ్దానికి పైగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెం.1 మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌.

ఈ మ‌ధ్య ఆయ‌న హ‌వా త‌గ్గినా.. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా త‌న ప్ర‌తిభ‌ని గుర్తు చేస్తున్నారు ఈ స్వ‌ర‌బ్ర‌హ్మ‌. గ‌తంలో మాదిరిగా రెగ్యుల‌ర్‌గా సినిమాలు చేయ‌క‌పోయినా.. నేప‌థ్య సంగీతంతో త‌రుచుగా సంద‌డి చేస్తున్నారు మ‌ణి . ఇలా.. ఫిబ్ర‌వ‌రి 2న కూడా ఆయ‌న నేప‌థ్య సంగీత‌మందించిన ట‌చ్ చేసి చూడు రిలీజ్ కాబోతోంది. విశేష‌మేమిటంటే.. అదే రోజున మ‌ణిశ‌ర్మ త‌న‌యుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీత‌మందించిన ఛ‌లో సినిమా రాబోతోంది. మ‌రి.. ఒకే రోజున రాబోతున్న ఈ తండ్రీకొడుకుల సినిమాల్లో ఏది విజ‌యం సాధిస్తుందో చూడాలి.