మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇక లేరు..

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు ఆర్మీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్దిరోజులుగా కోమాలోనే ఉన్న ప్రణబ్ నేడు తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘‘మా నాన్నగారు శ్రీ ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారని వేదనా భరిత హృదయంలో తెలియజస్తున్నా. ఆయన కోలుకోవాలని వైద్యులు తీవ్రంగా శ్రమించారు.. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ప్రార్థనలు నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు’’ అని అభిజిత్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ప్రణబ్ ముఖర్జీ ఆగస్ట్ 10న ఆసుపత్రిలో చేరారు. దీనికి ముందు ఆయనకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రణబ్‌కు మెదడులో రక్తం కట్టడంతో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించారు. సంబంధించిన శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రణబ్ ముఖర్జీ పశ్చిమ బెంగాల్‌లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో 1935 డిసెంబర్ 11న జన్మించారు. కొంతకాలం పాటు ఆయన తపాలాశాఖలో యూడీసీగా పని చేశారు. అనంతరం 1969లో ప్రణబ్ రాజకీయరంగ ప్రవేశం చేశారు.

కేంద్ర, రక్షణ, ఆర్థిక మంత్రిగా ప్రణబ్ సేవలందించారు. ఇందిరాగాంధీ, పీవీ, మన్మోహన్ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ఇందిరాగాంధీకి అత్యంత విశ్వసనీయంగా ఉన్నారు. 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ఆర్థిక మంత్రిగా పేరు గడించారు. 2012 జులై 25 నుంచి ఐదేళ్ల పాటు భారత రాష్ట్రపతిగా ప్రణబ్ పని చేశారు. కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు పొందారు. ప్రణబ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.