ప్రారంభమైన ఎన్నికల పోలింగ్..

  • IndiaGlitz, [Tuesday,December 01 2020]

హైదరాబాద్: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకే ఈ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పూర్తి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారధి తెలిపారు. జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఫిబ్రవరి 10, 2021తో ముగియనున్నప్పటికీ... రెండు నెలల 10 రోజుల ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయి.

కాగా.. ఇప్పటికే పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పరుచూరి గోపాల కృష్ణ, సీపీ అంజనీకుమార్ దంపతులు, రాచకొండ సీపీ మహేష్ భగవత్ కుటుంబం, మంత్రి కేటీఆర్ దంపతులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 150 డివిజన్లలో పోటీ పడుతున్న 1122 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు 74.44 లక్షల మంది ఓటర్లు 9101 పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.