ఎక్స్క్లూజివ్: బోటులో 73 కాదు 93 మంది ఉన్నారు!
Send us your feedback to audioarticles@vaarta.com
తూర్పుగోదావరి జిల్లా పాపికొండల వద్ద ఘోర బోటు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలతో బయటపడగా.. మరికొందరు విగతజీవులై తేలారు. ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. పడవ ప్రయాణంలో మొత్తం 73 మంది ఉన్నట్లు మంత్రులు మొదలుకుని ముఖ్యమంత్రి, ఉన్నాతాధికారుల వరకు అధికారికంగా మీడియా ముందుకు వచ్చి ప్రకటన చేశారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు 73 మంది కాదు.. 93 మంది ఉన్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ చెబుతుండటం గమనార్హం.
ఎప్పుడో జాడ తెలిసింది!?
తాను ఇలాంటి వ్యాఖ్యలు.. సంచలనం కోసమో, పేరు సంపాదించడం కోసమో ఈ విషయాలను వెల్లడించట్లేదని తన వద్ద ఎవరికీ తెలియని విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. అంతటితో ఆగని ఆయన.. సోమవారం మధ్యాహ్నానికే బోటు జాడ తెలిసిందని... అయితే లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయనే భయంతో బోటును ప్రభుత్వం వెలికీ తీయకుండా ఇలా చేస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపెట్టేందుకే ఇలా తప్పుడు సమాచారం ఇస్తున్నారని మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మొత్తం మంత్రే చేశారు!
‘బోటులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందులో ఫారెస్ట్, టూరిజం, ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారు. అందుకు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదు. ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారు’ అని మంత్రిపై హర్ష తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అవంతి రియాక్షన్!
మాజీ ఎంపీ హర్ష వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. హర్షకుమార్ చెబుతున్నవన్నీ అబద్దాలేనని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోటుకు తాను అనుమతి ఇచ్చేందుకు ఒత్తిడి చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అవంతి చాలెంజ్ చేశారు. అంతటితో ఆగని అవంతి.. హర్షకుమార్పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
మొత్తానికి చూస్తే.. బోట మునక కూడా రాజకీయమైపోయింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య ఈ విషయంలో మాటల యుద్ధం నెలకొంది. అయితే తాజాగా హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారం ఇంతటితో ఆగుతుందా..? లేకుంటే మరింత ముదురుతుందా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.