తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో 50 వేల ఖాళీల భర్తీ

ఎమ్మెల్యేలు, మాజీ శానస సభ్యులకు సంబధించిన పెన్షన్ బిల్లు సవరణను ఆర్థిక మంత్రి హరీశ్ రావు సభలో ప్రవేశపెట్టగా.. దీనిని సభ ఆమోదించింది. అలాగే ఉద్యోగ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం విషయంలో సైతం ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక నిరుద్యోగులకు సైతం గుడ్ న్యూస్ చెప్పారు. 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. ఇక పెన్షన్ బిల్లుపై సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసన సభ్యులు, మాజీ శాసన సభ్యులు ఆసుపత్రికి వెళ్లినప్పుడు చికిత్సకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. శాసన సభ్యులు, వారి సతీమణికి లేదా భర్తకు అవసరమైన చికిత్సల కోసం పది లక్షలు ఖర్చు చేసేలా బిల్లు పెడుతున్నామన్నారు.

సకాలంలో చికిత్స తీసుకునే విధంగా శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు వారి సతీమణి లేదా భర్తకు ఇది వర్తిస్తుందన్నారు. ఇంకా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘మాజీ శాసన సభ్యులకు సంబంధించిన కనీస పెన్షన్ 30 వేల నుంచి 50 వేల వరకు అప్పర్ సీలింగ్ 7 వేల వరకు ఈ బిల్లులో పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు శాసన సభ ఆమోదం. ప్రస్తుతం ఉద్యోగస్తుల వయసు 58 ఏళ్లు ఉంది. నాల్గవ తరగతికి ఉద్యోగులకు అరవై ఏళ్లు పదవీ విరమణ వయస్సు ఉంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో బోధన సిబ్బంది వయసు 65 సంవత్సరాలుగా ఉంది. న్యాయ సిబ్బందికి పదవీ విరమణ వయస్సు 60 సంవత్సరాలుగా ఉంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 60, 62 సంవత్సరాల వరకు పదవీ విరమణ వయస్సు అమలులో ఉంది.

సీఎం గారు, తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో హమీ ఇచ్చిన మేరకు 61 ఏళ్ల వరకు పదవీ విరమణ వయసు పెంచతూ ఈ బిల్లును సభ ముందుకు తేవడం జరిగింది. పెరిగిన ఆరోగ్య ప్రమాణాలు రీత్యా వారి పదవీ విరమణ వయసు పెంపుదల చేయడం జరిగింది. ఉద్యోగోస్థులు సీనియర్ అయితే వాళ్ల నైపుణ్యం పెరుగుతుంది. వాళ్ల అనుభవాన్ని వినియోగించుకోవాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ విషయాన్ని వేతన సవరణ కమిషన్ ముందు ఉంచడం జరిగింది. ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాం. పెంపుదల వల్ల ఖాళీల భర్తీపై ఎలాంటి ప్రభావం ఉండకుండా, ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇస్తూ., ఆ కింది స్థాయి ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో వెనువెంటనే 50 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సీఎం నిర్ణయించారు. త్వరలోనే వీటికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది’’ అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.