DGP of AP:ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా.. ఈసీ ఆదేశాలు

  • IndiaGlitz, [Monday,May 06 2024]

ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. పోలింగ్‌కు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది. సాయంత్రం 5 గంటల్లోపు డీజీపీగా బాధ్యతలు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా ఎన్నికల ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

కొత్త డీజీపీ కోసం సీనియారిటీ ప్రకారం ముగ్గురి పేర్లు పంపించాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపించింది. ఇందులో 1990వ బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు, 1991వ బ్యాచ్‌కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్, 1992వ బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా పేర్లను డీజీపీ పోస్టు కోసం సిఫార్సు చేసింది. ఈ ముగ్గురిలో హరీష్ కుమార్ గుప్తాను కొత్త డీజీపీగా నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.

కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్ష పార్టీలు గత కొంతకాలంగా తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విషయమై ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేశాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం రాజేంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు ఉపక్రమించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎలాంటి ఎన్నికల విధులు ఆయనకు అప్పగించొద్దని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఇప్పటివరకు పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం విధితమే.