close
Choose your channels

ఏపీలో థియేటర్ల పరిస్ధితిపై నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు... ట్రైయిన్ టికెట్స్‌తో పోలుస్తూ పోస్ట్

Sunday, December 26, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినిమా టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. హీరో నాని వ్యాఖ్యల తర్వాత .. ఒక్కొక్కరిగా సినీ ప్రముఖులు బయటకు వస్తున్నారు. అటు ప్రభుత్వం విధించిన రేట్లతో థియేటర్లను నడపలేమని యజమానులు స్వచ్చంధంగానే థియేటర్లను మూసేస్తున్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 100కుపైగా థియేటర్లను మూసేశారని సమాచారం. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం ఏపీ ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. ఒకరిద్దరు హీరోలపై వున్న కక్షతో మొత్తం సినీ పరిశ్రమను నాశనం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

తాజాగా ఏపీలో థియేటర్ల మూసివేత, టికెట్ రేట్ల తగ్గింపు వ్యవహారంపై యంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ట్రైన్‌లో టైర్ కంపార్ట్మెంట్స్ ఆధారంగా టికెట్లను ఎలా నిర్ణయిస్తున్నారో.. అలానే థియేటర్లలో టికెట్ రేట్లను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 20 రూపాయల టికెట్ సెక్షన్ కూడా ఉందని.. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయని నిఖిల్ చెప్పారు.

ఫ్లెక్సిబుల్ టికెట్ రేట్ తో బాల్కనీ, ప్రీమియర్ విభాగాన్ని అనుమతించాల్సిందిగా నిఖిల్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్లు తనకు దేవాలయం లాంటివని.. ప్రజలకు ఎప్పుడూ అవి ఆనందాన్ని ఇస్తాయని చెప్పుకొచ్చారు. ఏపీలో థియేటర్లు మూతపడటం చాలా బాధగా ఉందన్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. ఏపీ ప్రభుత్వం కూడా థియేటర్లకు పూర్వవైభవాన్ని తీసుకొస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు నిఖిల్ ట్వీట్ చేశారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటించిన '18 పేజెస్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే 'కార్తికేయ 2' సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.