ఆసుపత్రిలో హీరో సిద్ధార్ధ్: ఏ దేశంలో, ఏ సర్జరీ చేసుకుంటున్నాడో... అభిమానుల్లో ఆందోళన

  • IndiaGlitz, [Friday,September 24 2021]

హీరో సిద్ధార్థ్ ఆసుపత్రి పాలయ్యారా...? మహసముద్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఎందుకు కనిపించలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్త పెద్ద చర్చకు దారి తీసింది. అసలు మేటర్‌లోకి వెళితే.. శర్వానంద్, సిద్ధార్ధ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం మహాసముద్రం. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందుకు సంబంధించి ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రయూనిట్ మొత్తం హాజరైన సిద్ధార్థ మాత్రం కనిపించలేదు. దీనిపై మీడియా మిత్రులు, చిత్ర యూనిట్‌కు క్లారిటీ ఇచ్చారు దర్శకుడు అజయ్ భూపతి.

సిద్ధార్ధ్ విదేశాలలో శస్త్రచికిత్స చేయించుకుంటున్నారని అందువల్లే ఆయన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరుకాలేదని చెప్పారు. కానీ సిద్ధార్థ్‌కు ఏ తరహా శస్త్రచికిత్స అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే సిద్ధార్థ్.. సమకాలీన అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వుంటారు. కొన్ని కారణాల వల్ల తనకు జరిగే సర్జరీ ఏంటన్న దానిపై సోషల్ మీడియాలో వివరాలు చెప్పకూడదని సిద్ధూ నిర్ణయించుకున్నట్లుగా టాలీవుడ్ టాక్. అజయ్ భూపతి ఆ మాట చెప్పగానే సిద్ధార్ధ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, చిత్రయూనిట్ ఆకాంక్షించింది.

ఇక మహాసముద్రం ట్రైలర్ విషయానికి వస్తే... సముద్రం సన్నివేశంతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘సముద్రం చాలా గొప్పది. చాలా రహస్యాల్ని తనలోనే దాచుకుంటుంది’ అంటూ శర్వానంద్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు మెప్పిస్తోంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ పవర్‌ఫుల్‌గా కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. జగపతి బాబు, రావు రమేశ్‌ విలన్లుగా రఫ్పాడిస్తున్నారు. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్‌ ... ‘‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’’ అంటూ సిద్ధార్థ్‌ పలికే సంభాషణల్లో దర్శకుడు అజయ్‌ భూపతి మార్క్‌ కనిపిస్తోంది. ‘‘నేను దూరదర్శన్‌లో మహాభారత యుద్ధం చూసిన మనిషినిరా.. ఎదుటోడు వేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ రావు రమేశ్‌ తన స్టైల్‌లో డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకుంటోంది.