రఘురామ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..

  • IndiaGlitz, [Wednesday,May 19 2021]

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహరంలో ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని.. ఏపీ ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది.

రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని జ్యుడిషియల్ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు పేర్కొంది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

వైద్య పరీక్షల నివేదికను సుప్రీంకోర్టుకు..

కాగా.. రఘురామకు సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు వైద్యపరీక్షలు నిర్వహించారు. వీఐపీ స్పెషల్ రూములో ఆర్మీ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. రఘురామకు అయిన గాయాలపై నిన్న (మంగళవారం) నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డు కవర్‌లో సుప్రీం కోర్టుకు పంపించింది. రక్తం, చర్మ పరీక్షలు నిర్వహించినట్లు ఆర్మీ వైద్యులు నివేదికలో పేర్కొన్నారు. సీల్డ్ కవర్‌లోని నివేదిక, వీడియోను శుక్రవారం సుప్రీం కోర్టు పరిశీలించనున్నట్లు సమాచారం. మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు రఘురామ ఆర్మీ ఆస్పత్రిలో జ్యడిషియల్ కస్టడీలో ఉంటారు. కొవిడ్ నిబంధనల ప్రకారమే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్మీ వైద్యులు తెలిపారు. రెండో రోజు పరీక్షల్లో భాగంగా.. రఘురామకు ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు.