close
Choose your channels

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Friday, May 21, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ హైకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఊహించని షాక్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తై.. కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్నికలను హైకోర్టు రద్దు చేస్తూ తీర్పును వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ లేదని వ్యాఖ్యానించింది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న నిబంధన పాటించలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేవలం వారం వ్యవధిలోనే ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిందని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ ఎం సత్యనారాయణ మూర్తి ఎన్నికలను రద్దు చేస్తున్నట్టు తీర్పును వెలువరించారు.

హైకోర్టు వెలువరించిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లనుంది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే జనసేన, బీజేపీ నేతలు సైతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తొలుత విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ జడ్జి... ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ ఏప్రిల్‌ 6న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఏప్రిల్ 7న విచారణ జరిపిన డివిజన్ బెంచ్ ధర్మాసనం షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్ 8న ఎన్నికల నిర్వహణకు అనుమతిచ్చింది. అయితే ఓట్ల లెక్కింపును చేపట్టవద్దని ఆదేశించింది.

పోలింగ్ అనంతరం ఇరుపక్షాల తరుఫున హైకోర్టులో వాదనలు కొనసాగాయి. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దాఖలు చేసిన మూడు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణ మూర్తి మే 4న విచారణ జరిపి తీర్పును రిజర్వు చేశారు. తాజాగా, తీర్పును వెలువరించిన కోర్టు.. నోటిఫికేషన్ చెల్లదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. ఈ తీర్పును పూర్తిగా అధ్యయనం చేసిన మీదట ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.