‘మహిళలంటే పవన్కు ఎందుకంత చులకనో..!’
- IndiaGlitz, [Wednesday,December 04 2019]
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు ఫైర్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై బుధవారం మీడియా ముందుకొచ్చిన హోం మంత్రి మేకతోటి సుచరిత, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని.. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష అవసరం లేదని.. అందరూ చూస్తుండగా వారికి రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందన్న పవన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆమె ఖండించారు. రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా..? అని ఈ సందర్భంగా సుచరిత ప్రశ్నించారు.
ఎందుకంత చులకన పవన్..!?
మహిళలంటే పవన్కు ఎందుకంత చులకనో అర్థమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నామని చెప్పారు. మహిళలకు భద్రత కరువవుతోందని ఆందోళన చేస్తుంటే ఒక పార్టీకి నాయకుడైన పవన్ ఇలా మాట్లాడటం తగదన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భద్రతకు పెద్దపీట వేశారన్నారు. సైబర్ మిత్ర, మహిళా మిత్ర, బీ సేఫ్ యాప్ను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. దిశ ఘటనతో జగన్ చలించిపోయారని, మన రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్ను తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుందోని హోం మంత్రి సుచరిత వెల్లడించారు.
డిప్యూటీ సీఎం స్పందన ఇదీ..!
‘పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయి. మహిళలందరికీ పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. రేపిస్టులకు రెండు బెత్తం దెబ్బలు కొడితే సరిపోతుందనడం సరికాదు. ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా..?. మహిళల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తాం’ అని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు.