close
Choose your channels

మంత్రి సబిత కుమారుడి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం..

Thursday, January 7, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంత్రి సబిత కుమారుడి పేరుతో తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసం..

తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మూడో కుమారుడైన కళ్యాణ్ రెడ్డి పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఆదిలాబాద్ టౌన్‌కి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది నుంచి ప్రవీణ్ కుమార్ తిరుపతి పీఆర్‌ఓకి ఫోన్ చేసి తనను సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కళ్యాణ్ రెడ్డిగా పరిచయం చేసుకుని దర్శనం కోసం తమ బంధువులు వస్తున్నారని సమాచారం ఇస్తూ వస్తున్నాడు. కాగా.. తిరుపతిలో పీఆర్ఓ స్నేహితుడికి హైదరాబాద్‌లో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ కావాల్సి వచ్చింది. దీంతో సదరు పీఆర్ఓ తెలంగాణ విద్యాశాఖ మంత్రి కుమారుడు తనకు తెలుసని.. దర్శనాల కోసం కాల్ చేస్తూ ఉంటాడని చెప్పి ప్రవీణ్‌రావుకి ఫోన్ కలిపి... విషయం మొత్తం వివరించాడు.

డబ్బులు గూగుల్ పే చేయమని సీటు కన్ఫర్మ్ చేయిస్తానని తెలిపాడు. దీంతో ఏడు లక్షల రూపాయలు నెల రోజుల లోపు ప్రవీణ్ రావుకి పంపించారు. అయితే ఎంతకీ కాలేజ్ సీట్ కన్ఫర్మ్ కాకపోవడంతో లేదని అనుమానం వచ్చిన ఆ వ్యక్తులు సబితా ఇంద్రారెడ్డి కుమారుడైన కార్తిక్ రెడ్డి‌ని సంప్రదించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సబితా ఇంద్రారెడ్డి మూడో కుమారుడైన కళ్యాణ్ రెడ్డి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేశాడు. కళ్యాణ్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్‌కు వెళ్లి ప్రవీణ్‌ను పట్టుకున్నారు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.. ప్రవీణ్ రావును విచారించగా అతని మోసాల చిట్టా అంతా బయటకు వచ్చింది. ప్రవీణ్ రావు చేసిన మోసాలను తెలుసుకుని పోలీసులే ఆశ్చర్యపోయారు. గురునానక్ కాలేజ్ విద్యార్థిగా 2016లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న ప్రవీణ్ జల్సాలకు అలవాటుపడి ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడడం తేలింది.

ప్రవీణ్‌రావు మోసాల చిట్టా..

1)ఆసిఫ్ నగర్ డీఈఓను ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని లక్ష రూపాయలు ప్రవీణ్ కుమార్ తీసుకున్నాడు. మరో మొబైల్ నుంచి సదరరు డీఈఓకు ఫోన్ చేసి కళ్యాణ్ రెడ్డన్న పంపాడని డబ్బులు తీసుకొని వచ్చాడు.

2) మహావీర్ హాస్పటల్లో నీళ్లకు ఇబ్బందిగా ఉందని సమాచారం తెలుసుకున్న ప్రవీణ్ కుమార్.. మిషన్ భగీరథతో మీ హాస్పిటల్‌కు నీటి సదుపాయం కల్పిస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు వసూలు చేశాడు.

3) మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో లాక్‌డౌన్ సమయంలో విద్యా తరగతులతో పాటు పాసులు ఇప్పిస్తానని రెండు లక్షల రూపాయలు తీసుకున్నాడు.

4) ఆన్లైన్లో లో పరిచయమైన ఒక అమ్మాయి తో కూడా నేను కళ్యాణ్ రెడ్డి అని చాటింగ్ చేసి ఉద్యోగం ఇప్పిస్తానని ఒక్క లక్ష 50 వేల రూపాయలు వసూలు చేశాడు.

ఇంకా పలువురి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. ఫోన్ ట్రూ కాలర్‌లో కళ్యాణ్ ఇంద్రారెడ్డి అని తన పేరు వచ్చేలా సేవ్ చేసుకోవడంతో పెద్దగా ఎవరికీ అనుమానం రాలేదు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని సెక్షన్ 420 419 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. శంషాబాద్ ఆర్‌జీఐ పోలీస్ స్టేషన్‌లో కూడా ప్రవీణ్ కుమార్‌పై కేసు నమోదైనట్లు రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.