'మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ ' టైటిల్ నెగ్గిన హైదరాబాదీ మానసా జొన్నలగడ్డ

  • IndiaGlitz, [Thursday,August 31 2017]

మానసా జొన్నలగడ్డ... ఇప్పుడీ పేరు అందాల ప్రపంచంలో ఓ సంచలనం. ఎవరీ అమ్మాయి? అంటే... హైదరాబాదీనే. కానీ, పుట్టింది.. పెరిగింది.. అమెరికాలో. ఇంతకీ, ఈ అమ్మాయి ఏం చేసింది? అంతగా సంచలనం కావడానికి కారణం ఏంటి? అంటే... ఈ బ్యూటీ మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌' టైటిల్‌ విన్నర్‌.

ఈ నెల (ఆగస్టు) థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌' అందాల పోటీల్లో మానసా జొన్నలగడ్డ విజేతగా నిలిచారు. లోర్వెన్‌ ఈవెంట్స్‌' అరుణ్‌ కుమార్, సాయిచంద్‌లు ఈ అందాల పోటీ ఈవెంట్‌ను నిర్వహించారు. మన దేశంతో పాటు శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్, దుబాయ్, మలేసియా దేశాల నుంచి పలువురు అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతగా నిలిచిన మానసా జొన్నలగడ్డకు ప్రముఖ సై్టలిస్ట్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లియో ఆమ్‌డాల్‌ కిరీటాన్ని తొడిగారు.

మానసా జొన్నలగడ్డ అమెరికాలో పుట్టి పెరిగినా, ఐదేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. మాదాపూర్‌లోని ప్రముఖ పాఠశాల మెరిడియన్‌లో చదువుకున్నారు. స్కూల్‌ డేస్‌లో మిస్‌ మెరిడియన్‌' టైటిల్‌ నెగ్గారు. స్కూలింగ్‌ తర్వాత గీతమ్‌ యూనివర్శిటీలో ఇంజినీరింగ్‌ థర్డ్ ఇయర్ చేస్తున్నారు.

మిస్‌ ఇండియా ఏసియా పసిఫిక్‌' టైటిల్‌ నెగ్గిన సందర్భంగా మానసా జొన్నలగడ్డ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ప్రతి అడుగులోనూ నా తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. అలాంటి పేరెంట్స్‌ ఉండడం నా అదృష్టం. ఇక, ఈ అందాల పోటీ విషయానికి వస్తే... పోటీలు ప్రారంభం కావడానికి రెండు నెలల ముందు నుంచి నేను ప్రిపరేషన్‌ మొదలుపెట్టా. ఫిట్‌నెస్, డైట్, యోగా... ప్రతి అంశంలోనూ ఎంతో శ్రమించా. అలాగే, కమ్యునికేషన్‌ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, స్పీచెస్‌పై కాన్‌సన్‌ట్రేట్‌ చేశా'' అన్నారు.

అందాల పోటీల్లో నెగ్గిన అమ్మాయిలకు చిత్రపరిశ్రమ నుంచి అవకాశాలు రావడం సజహమే. ఆ విధంగా వచ్చినవాళ్లల్లో చాలామంది స్టార్‌ హీరోయిన్స్‌గా ఎదిగారు. మరి, మీరూ హీరోయిన్‌గా వస్తారా? అని మానసను ప్రశ్నిస్తే... సినిమాల్లో నటించాలనేది నా కల. నాకు మంచి పేరు తీసుకొచ్చే, పర్‌ఫార్మెన్స్‌కు మంచి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్స్‌లో నటించాలనుంది'' అని చెప్పారు.

మరి.. సమాజ సేవలేమైనా చేయాలనుకుంటున్నారా? అనడిగితే - "అనాథలకు నా వంతుగా సహాయం చేయాలనుకుంటున్నా. పుట్టేటప్పుడు ఎవరూ అనాథలు కాదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు వాళ్లను అనాథలను చేస్తాయి. వాళ్లను ఆదుకోవాలనుకుంటున్నా'' అన్నారు.