close
Choose your channels

నాకు ప్రాణ హాని ఉంది.. రక్షణ కల్పించండి..: నిమ్మగడ్డ రమేష్

Wednesday, March 18, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా పడిన తర్వాత రగడ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వర్సెస్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వాయిదా ప్రకటన అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా మీట్ పెట్టి మరీ రమేష్‌పై తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ సీఎస్ నీలం సాహ్నీ లేఖ రాయడం.. మరోవైపు హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం.. జరిగింది. అయితే.. కోర్టుల నుంచి జగన్ సర్కార్‌కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు తనను విమర్శించిన జగన్ సర్కార్‌కు నిరసనగా ఇప్పటికే మూడు పేజీల లేఖను సైతం సీఎస్‌కు రమేష్ కుమార్ పంపారు. దీంతో రమేష్ కుమార్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు.. రమేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడం.. ఇంకొందరైతే బూతులు మాట్లాడుతండటం.. మరికొందరైతే ఏకంగా ఆయనకు వార్నింగ్‌లు కూడా ఇచ్చారనే వార్తలు కూడా వస్తున్నాయి.

నాకు రక్షణ కల్పించండి!
ఈ క్రమంలో తనకు ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలంటూ కేంద్రానికి రమేష్ విజ్ఞప్తి చేస్తూ హోం శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. ఏపీలో తనకు భద్రత కరువైందని.. తనకు రక్షణకు కల్పించాలంటూ ఆయన కోరారు. తనపై, కుటుంబ సభ్యులపై దాడులు జరిగే అవకాశం ఉందని లేఖలో నిశితంగా ఆయన వివరించారు. కేంద్ర బలగాలతో తనకు రక్షణ కల్పించాలని ఈ మేరకు ఆయన లేఖలో కోరారు. ఇలా చాలా విషయాలను మొత్తం 5 పేజీల లేఖలో హోంశాఖ కార్యదర్శికి రమేష్ కుమార్ పంపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తనకు భద్రత కల్పించాలని కోరారు.

ఏకగ్రీవాల విషయం కూడా!
అంతేకాదు.. ఏపీలో జరిగిన ఏకగ్రీవాలపై కూడా లేఖలో ఆయన నిశితంగా వివరించారు. ‘2014 ఎంపీటీసీ ఎన్నికల్లో 2 శాతం మాత్రమే ఏకగ్రీవాలు జరిగాయి. విభజన ఏపీలో ఇప్పుడు 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. సమైక్య రాష్ట్రంలో 2014లో కేవలం ఓకే జడ్పీటీసీ మాత్రమే ఏకగ్రీవం అయ్యింది. ఇప్పుడు ఒకట్రెండు కాదు ఏకంగా 126 జడ్పీటీసీలు ఏకగ్రీవాలు అయ్యాయి. కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరం. నా భద్రతతో పాటు ఎన్నికల కోసం కేంద్ర బలగాలు అవసరం ఉంది’ అని రమేష్ లేఖలో నిశితంగా వివరించారు. పనిలో పనిగా.. మంత్రులకు జగన్ టార్గెట్ ఇచ్చిన విషయాన్ని కూడా ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు.

కేంద్రం రియాక్షనేంటి..!?
మొత్తానికి చూస్తే రాష్ట్రంలో స్థానిక సంస్థల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎస్ఈసీ రాసిన ఈ లేఖ ఏపీలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నిలిపేస్తున్నట్లు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సుప్రీం కోర్టు జగన్‌ సర్కార్‌కు షాకివ్వగా.. కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.