నేనెప్పుడూ ఉల్లి తిన్లేదు.. రేట్లు నాకెలా తెలుస్తాయ్: కేంద్ర మంత్రి
- IndiaGlitz, [Thursday,December 05 2019]
ఉల్లి ధరలు పెరిగాయంటూ దేశమంతా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఉల్లి ధరలపై విపక్షాలన్నీ ఆందోళనకు దిగాయి. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను ఉల్లి గానీ.. వెల్లుల్లి గానీ ఎక్కువగా తినను. మా ఫ్యామిలీలో కూడా వీటికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వరు. అందుకే ఈ ధరల పెరుగుదల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి భారం కాదు’ అని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఉల్లిగడ్డలు తినడం మానేయండని.. కూడా ఆమె ఉచిత సలహా ఇచ్చారు. మరో మంత్రి మాట్లాడుతూ.. ఉల్లి తినడం మానేస్తే డిమాండ్ తగ్గుతుందని, ఫలితంగా ధరలు వాటంతట అవే దిగొస్తాయని తెలిపారు.
నాకెలా తెలుస్తోంది..!
ఇదిగో ఈ ఫొటోలోని కేంద్ర మంత్రి అశ్విని చౌబే చూడండి ఉల్లిధరలపై ఎలాంటి బదులిచ్చారో.. నేను వెజిటేరియన్ని నేనెప్పుడూ ఆనియన్ తినలేదు. అలాంటి నాకు మార్కెట్లో ఉల్లి ధరలు పెరిగాయన్న విషయం ఎలా తెలుస్తుంది’ అని పార్లమెంట్లో చెప్పడం గమనార్హం. ఇలా చిత్రవిచిత్రాలుగా పలువురు కేంద్ర మంత్రులు ఉల్లిధరలపై సమాధానాలిచ్చారు. ఇలా మాట్లాడిన మంత్రులు అసలు విషయాన్ని మాత్రం మర్చిపోయారు. అయితే మంత్రుల సమాధనంతో పార్లమెంట్లోని సభ్యులు కొందరు నోరెళ్లబెట్టారు. ఇందుకు పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో టీవీలు చూస్తున్న జనాలు విస్తుపోయారు. మరోవైపు విపక్షపార్టీలు మాత్రం ఆందోళనకు దిగుతున్నాయి.