close
Choose your channels

నా పిల్లల సాక్షిగా ప్రభాస్‌తో ఎలాంటి సంబంధంలేదు..!

Monday, January 14, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా పిల్లల సాక్షిగా ప్రభాస్‌తో ఎలాంటి సంబంధంలేదు..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిళ- టాలీవుడ్ హీరో ప్రభాస్‌ల‌కు మధ్య సంబధం ఉందని.. అప్పట్లో హీరోను కూడా కొట్టించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తెలిసిందే. మరీ ముఖ్యంగా 2014 ఎన్నికలకు ముందు సోషల్ మీడియాలో ఈ పుకార్లు విపరీతంగా వచ్చాయి. దీంతో పలు వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు పుంకాలు పుంకాలుగా కథనాలు రాయడం జరిగింది. అయితే ఎన్నికలకు ముందే ఇలా టార్గెట్ చేస్తుండటంతో ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని భావించిన వైఎస్ కుటుంబం హైదరాబాద్ సీపీని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు.

ప్రమాణం చేసి చెబుతున్నా..!
"ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధముందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. ప్రభాస్ అనే వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. కనీసం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు ఏ సంబంధమూ లేదు. ఇది నిజం.. ఇదే నిజమని నా పిల్లలపై ప్రమాణం చేసి మరీ చెబుతున్నాను. పోనీ.. ఇలా దుష్ప్రచారం చేస్తున్నవారు ఇవన్నీ నిజమేనని ప్రమాణాలు చేసి చెప్పగలరా..?. పోనీ ఆ వ్యక్తిని కలిసినట్లు గానీ, మాట్లాడినట్లుగానీ రుజువులు, ఆధారాలు చూపించగలరా..?. పుకార్లు చూపించి వ్యక్తిత్వాన్ని చంపాలనుకోవడం దారుణం?. నన్ను ప్రేమించే నా భర్త ఉన్నాడు.. నా మీద ఆధారపడ్డ నా పిల్లలున్నారు. నాతో పాటు మా కుటుంబం, మా శ్రేయోభిలాషులు అందర్నీ ఈ విషయం బాధపెట్టింది. పుకార్లు పుట్టించి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటం ఎంత వరకు సబబు..? ఏమిటీ పైశాచిక ఆనందం.. ఎందుకింత నీచానికి దిగజారటం..? ఇలా పుకార్లు చేస్తున్నవారికి.. వారి వెనకున్న వాళ్లకు సిగ్గుగా అనిపించలేదా? ఇంత దిగజారుడుతనం అవసరమా..?" అని వైఎస్ షర్మిళ ఆవేదన వెలిబుచ్చారు.

ఇదంతా చేస్తోంది టీడీపీనే.. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?
"ఈ ప్రచారాల వెనుక టీడీపీ హస్తం ఉందని అనుమానం లేకుండా ఆరోపణ చేస్తున్నాను. టీడీపీకి పుకార్లు పుట్టించడం కొత్తేం కాదు. గతంలో మా నాన్న ఫ్యాక్షనిస్టు, మా అన్న గర్విస్టు.. కోపిష్టి అని టీడీపీనే పుకార్లు పుట్టించింది. నాపై పుకార్లు పుట్టిస్తుంది కూడా టీడీపీనే.
టీడీపీ వాళ్లకు సంబంధం లేకుంటే ఎందుకు ఖండించలేదు?. స్వయంగా చంద్రబాబు లాంటి వాళ్లే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తారు.. టీడీపీ నాయకులు అనుసరిస్తారు. చంద్రబాబు ఇంట్లో ఆడవాళ్లు లేరా?. మేం పుకార్లు పుట్టించాలి అనుకుంటే మేం పుట్టించలేమా? మాకు తెలివి లేకా కాదు.. పుట్టించలేకా కాదు.. మేం అలా చేయలేదంటే కారణం.. మాకు విలువలున్నాయి. చంద్రబాబు డిక్షనరీలో విలువ, ఎథిక్స్‌ అనే పదాలే లేవు. చంద్రబాబు లాంటి వాళ్లు అధికారంలో ఉన్నన్ని రోజులు సమాజం బాగుపడదు" అని సీఎంపై షర్మిళ సంచలన ఆరోపణలు చేశారు. మా ఫిర్యాదు స్వీకరించిన సీపీ కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.

నా గురించి నాకు.. నా దేవుడికి తెలుసు!
" 2014 ఎన్నికలప్పుడే ఈ దుష్ప్రచారం మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియలో ప్రచారాలు చేస్తున్నారు. ఇక ముందు మళ్లీ మళ్లీ ఇలా దుష్ప్రచారం మొదలవ్వచ్చు. ఈ విషయాలపై నేను మాట్లాడకపోతే ఇదే నిజమని కొంతమంది అనుకునే ప్రమాదముంది. అందుకే ఈ తప్పుడు ప్రచారాలను మూలాలతో సహా తొలగించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. నేను ఒక భార్యగా, తల్లిగా, ఒక చెల్లిగా నా నైతికతను, నా నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గురించి నాకు, నా దేవుడికి తెలుసు. కానీ ఈ రోజు నా గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది గనుక మీ అందరి ముందుకొచ్చి చెబుతున్నాను" అని షర్మిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో కూడా ఫిర్యాదు చేశా..!
" నాపై సోషల్‌మీడియాలో ఓ వర్గం దుష్ప్రచారం చేసింది. 2014 ఎన్నికల తర్వాత ఫిర్యాదు కూడా చేశాను. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని విషప్రచారానికి వేగం పెంచారు. తప్పును తప్పు ఎత్తిచూపడానికి చట్టప్రకారం ఇలాంటివి సృష్టిస్తున్నవారిపై, వారి వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలి. " నా క్యారెక్టర్‌‌ను దెబ్బతీయడానికి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్న వారిపై, సృష్టిస్తున్నవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాము. ఇది నా ఒక్కదానికే జరిగిన అవమానంగా భావించట్లేదు.. ఇలాంటి రాతలు ఎంతో మంది మహిళలపై కూడా రాస్తున్నారు. స్త్రీల పట్ల ఇంత శాడిజం, ఇంత చులకన భావంతో రాస్తున్న రాతలను దుష్ప్రచారాన్ని మన సమాజం ఆమోదించవచ్చా..!?. ఇలాంటి వ్యవహారాలపై మనం గొంతు ఎత్తాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు వెబ్‌సైట్, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు రాయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న నా ఫిర్యాదుకు మద్దతు పలకాలని ప్రజాస్వామ్యవాదులు, నైతికత ఉన్న రాజకీయ నాయకులు, జర్నలిస్ట్‌లను, మహిళలను కోరుతున్నాను" అని ఈ సందర్భంగా షర్మిళ తెలిపారు.

ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదు..
"ఆంధ్రా పోలీసులపై మాకు నమ్మకం లేదు. అందుకే హైదరాబాద్‌కు వచ్చి ఫిర్యాదు చేశాను. కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చారు" అని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు షర్మిళ సమాధానమిచ్చారు. కాగా గత ఏడాది వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌పై దాడి జరిగినప్పుడు కూడా ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని అందుకే వాంగ్మూలం ఇవ్వనని చెప్పిన సంగతి తెలిసిందే. అప్పుడు అన్న.. ఇప్పుడు సోదరి ఇద్దరూ ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదనడం గమనార్హం. అయితే ఈ వ్యాఖ్యలపై పోలీసు సంఘాలు ఎలా రియాక్టవుతాయో వేచి చూడాలి.

పవన్ అభిమానులపై..
మాపైనా, మా కుటుంబసభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేసినట్లు షర్మిళ తెలిపారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కాగా వైఎస్ జగన్.. పవన్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడినప్పుడు జనసేనకు సంబంధించిన సోషల్ మీడియా పెద్దఎత్తున హంగామా చేస్తూ.. ట్రోలింగ్ చేసిన సంగతి నెటిజన్లందరికీ తెలిసే ఉంటుంది. అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులపై షర్మిళ చేసిన సంచలన ఆరోపణలపై వారి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.