‘ఇది మహాభారతం కాదు’.. టైటిల్‌లోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నా: వర్మ

దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం తీసినా సంచలనమే.. ఏం మాట్లాడినా సంచలనమే. ఇప్పటి వరకూ ఆయన భయపెట్టినా.. రాజకీయ నేతల సినిమాలు తీసినా.. బయోపిక్‌లు తీసినా.. ఎరోటిక్, లెస్బియన్ సినిమాలు తీసినా.. ఇటీవల జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాలు తీసినా ఎవరో ఒకరి ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకరకంగా ఆయనకు ఇదే ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. పైసా ఖర్చు లేకుండా తన సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని కల్పించుకోవడంలో ఆర్జీవీ దిట్ట. ఏం చేసినా సంచలనమే కాబట్టి ఆయనకు సంచలన దర్శకుడిగా పేరు పడింది.

తాజాగా ఆర్జీవీ తన పంథాను మార్చుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఏమాత్రం ఇబ్బంది లేకుండా తనలోని మరో కోణాన్ని ఓటీటీ వేదికగా పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించేందుకు వర్మ సిద్ధమవుతున్నారు. స్పార్క్ ఓటీటీ సంస్థతో కలిసి ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్‌ను నేడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌కు పెట్టిన పేరు మరింత ఆసక్తికరంగా ఉంటడంతో నెటిజన్లు బాగా కనెక్ట్ అవుతున్నారు.

‘ఇది మహాభారతం కాదు’ అనే ఆసక్తికర టైటిల్‌తో వర్మ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘‘నేను తీస్తున్న వెబ్ సిరీస్ మహాభారతం కాదు. కానీ మహాభారతంలో ఉన్న కేరెక్టర్లు, సంఘటనలు మొత్తం ప్రపంచంలో ఎక్కడో ఒక మూల ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయనేది మీ అందరికీ తెలిసిన నిజమైన నిజం. ఆస్తి తగాదాలు, కక్షలు, కుట్రలు, కపట నాటకాలు, వ్యసనాలు భావోద్వేగాలు, కామోద్రేకాలు, మానభంగాలు, చంపడాలు, చంపించడాలు అనేవి మహాభారతం రాయక ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని ఒక గ్రామంలో మహాభారతంలో జరిగినటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు ఎలా ప్రవర్తించారు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు?’’ అనే కథాంశంతో తెరకెక్కిస్తున్న వర్మ ఆడియో ద్వారా వెల్లడించారు.దీనిపై నిరసనలకు దిగి గొంతు పోగొట్టుకోవద్దని.. టైటిల్‌తోనే పిచ్చ క్లారిటీ ఇస్తున్నానని, చెవులు తెరుచుకుని వినాలని ఆర్జీవీ ఆడియో క్లిప్‌లో సూచించడం విశేషం.