పీవీ సింధును పద్మభూషణ్ వరిస్తుందా!?

  • IndiaGlitz, [Thursday,September 12 2019]

తెలుగుతేజం, బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్ పీవీ సింధుకను పద్మభూషణ్ వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా.. సింధు పేరును మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కోసం క్రీడా శాఖ ప్రతిపాదించడం జరిగింది. ఈమెకు అవార్డును ఇవ్వాలంటూ, కేంద్రానికి సిఫార్సులు వెళ్లినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. 2017లో కూడా ఇదే పురస్కారానికి సింధు పేరు సిఫార్సు అయినప్పటికీ, అవార్డుల కమిటీ మాత్రం ఎంపిక చేయలేదన్న విషయం విదితమే. అయితే ఈ దఫా మాత్రం పక్కాగా పద్మభూషణ్ సింధూను వరిస్తుందని సమాచారం.

ఇదిలా ఉంటే.. పద్మ విభూషణ్ కోసం ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ పేరును కూడా కేంద్ర క్రీడా శాఖ సిఫార్సు చేసినట్టు సమాచారం. అంతేకాదు.. క్రికెటర్ హర్మన్ ప్రీత్ సింగ్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంఫాల్, రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రా, షూటర్ సుమా శిరూర్, మౌంటెనీర్లు తాషి, సుంగ్లీ మాలిక్ ఇలా అందరూ మహిళల పేర్లనే కేంద్ర క్రీడా శాఖ సిఫార్సు చేసినట్లు సమాచారం. అయితే వీరిలో ఎంతమందిని పద్మా అవార్డులు వరిస్తాయో.. ఎంతమంది ఆశలు అడియాసలు అవుతాయో మరి.