ISRO : జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం... ఈ శాటిలైట్ వల్ల ఉపయోగాలివే

  • IndiaGlitz, [Monday,May 29 2023]

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సోమవారం జీఎస్‌ఎల్వీ ఎఫ్ 12 రాకెట్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 10.42 గంటలకు రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకీ దూసుకెళ్లింది. ఆపై ఎన్‌వీఎస్ 1 రాకెట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ అభినందనలు :

ఈ శాటిలైట్ దేశీయ నావిగేషన్ సేవలు అందించనుంది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు ఇస్రో సైంటిస్ట్‌లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ డా.సోమ్‌నాథ్ మాట్లాడుతూ.. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ ప్రయోగం విజయవంతమైందన్నారు. ఇది ఇస్రో సభ్యుల కృషి వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఎన్‌వీఎస్ 01 ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరిందని.. రాకెట్ ప్రయోగంలో క్రయోజనిక్ స్టేజి చాలా కీలకమైనదని, ఆ స్టేజీ కూడా సవ్యంగా సాగిందని డాక్టర్ సోమ్‌నాథ్ తెలిపారు.

ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి నావిగేషన్ శాటిలైట్ ప్రయోగం:

ఇకపోతే.. జీఎస్ఎల్వీ ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు కాగా.. బరువు 420 టన్నులు. దీని ద్వారా నింగిలోకి పంపిన ఎన్‌వీఎస్ 01 రాకెట్ జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారతదేశ ప్రధాన భూభాగం చుట్టూ దాదాపు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పోజిషనింగ్ సేవలను అందిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దేశీయ నావిగేషన్ సేవల కోసం గతంలో ఇస్రో పంపిన నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహానికి అంతరిక్షంలోకి పంపుతున్నామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు.