ఏపీకి ప్రామిసింగ్ లీడర్ జగన్ సీఎంగా వచ్చారు!
- IndiaGlitz, [Thursday,May 23 2019]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, రాజకీయ-సినీ ప్రముఖులు వైస్ జగన్ మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కాగా ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ దంపతులు ఈ సందర్భంగా వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎసీపీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా నటి, నిర్మాత జీవితా రాజశేఖర్ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న జగన్కు వారు శుభాకాంక్షలు తెలిపారు.
మేం ప్రచారం చేసిన చోట్ల గెలిచారు!
ఈ సందర్భంగా రాజశేఖర్ దంపతులు మాట్లాడుతూ.. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మేం వైసీపీ చేరాం. అందువల్ల, పార్టీ తరపున ఎక్కువ సమయం ప్రచారం చేయడానికి వీలు కాలేదు. అయినప్పటికీ... పది పదిహేను రోజుల పాటు వీలైనన్ని నియోజకవర్గాలు తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాం. గాజువాక, గన్నవరం, నందిగామ, భీమవరం, విజయవాడ తదితర నియోజకవర్గాల్లో పార్టీ తరపున ముమ్మరంగా ప్రచారం నిర్వహించాం. మేం ప్రచారం చేసిన పలు చోట్ల, దాదాపుగా అన్ని ప్రాంతాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ విజయానికి జగన్ గారు పూర్తిగా అర్హులు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ఆయన విజయం చాలా సంతోషాన్నిచ్చింది అని జీవిత దంపతులు చెప్పుకొచ్చారు.
జగన్ చెప్పినవన్నీ చేస్తారు!
ఏపీ ప్రజలకు ప్రామిసింగ్ లీడర్ ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన హయాంలో అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకు వెళుతుంది. వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు జగన్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకొనే విధంగా ఆయన పాలన ఉండబోతోని బలంగా విశ్వసిస్తున్నాం. మేమింత బలంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే... ఆయనతో మాట్లాడినప్పుడు ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలనుకుంటున్నారో వివరించారు. ఆయన చెప్పినవన్నీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కి జగన్ గారు ప్రత్యేక హోదా తీసుకు వస్తారని మేం బలంగా నమ్ముతున్నాం. అలాగే, కేంద్రంలో నరేంద్రమోదీగారు విజయం సాధించడం సంతోషంగా ఉంది అని రాజశేఖర్ దంపతులు అన్నారు.