Sharmila:వైఎస్‌ఆర్ పేరును సీబీఐ కేసులో చేర్చింది జగనే.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Friday,April 26 2024]

ఏపీ ఎన్నికల వేళ ఏపీసీసీ చీఫ్ షర్మిల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైఎస్ఆర్ పేరును అసలు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చలేదని.. చేర్పించింది జగన్ మోహన్ రెడ్డి లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో వైఎస్‌ పేరు లేకుంటే ఆ కేసుల్లో నుంచి జగన్‌ బయటపడరని స్వయంగా సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసి చేర్పించారనని తెలిపారు. అందుకు ప్రతిఫలంగా అదే సుధాకర్ రెడ్డికి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారన్నారు. వైఎస్‌ఆర్‌ పేరు CBI ఛార్జ్‌షీట్‌లో చేర్చడంలో కాంగ్రెస్ పాత్ర లేనే లేదని కుండబద్ధలు కొట్టారు. దీంతో షర్మిల వ్యా్ఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చీనీయాంశంగా మారాయి.

అంతేకాకుండా పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ధీటుగా సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడతారా? నా ఒంటిమీద ఉన్న బట్టలు గురించి మాట్లాడుతుంటే సభ్యత ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా? పసుపు రంగును చంద్రబాబు ఎక్కడైన కాపీ రైట్ చేసుకున్నాడా..? మీ సాక్షి పత్రికలో పసుపు రంగు ఉండదా.. నా పసుపు రంగు చీర గురించి మాట్లాడటం సిగ్గుగా అన్పించలేదా..? చెల్లెలు దుస్తుల గురించి ప్రస్తావన చేశావంటే ఇంతటి దిగజారుడుతనం ఉంటుందా..? షర్మిల మండిపడ్డారు.

నేను చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్నాను అంట. నేను వైఎస్ఆర్ బిడ్డను.. నాకు ఎవరి దగ్గర మోకరిల్లె అవసరం లేదు. చూసుకుంటూ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివేది జగన్ రెడ్డే. మక్కీకి మక్కీ చదివేది జగన్ రెడ్డి. మీ కుక్క బిస్కెట్లు తిని ఎంతో మంది నాపై తప్పుడు ప్రచారం చేసినా పట్టించుకోలేదు. బీజేపీ దగ్గర మోకరిల్లింది మీరు. మోదీకి దత్తత పుత్రుడు జగన్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాలు మీద ఒక్కరోజు మాట్లాడలేదు. జగన్ రెడ్డి వైఎస్ఆర్ వారసుడు కాదు. మోదీకి వారసుడు. వివేకా హత్య గురించి మేము మాట్లాడకూడదనే కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు. కానీ వీరు మాత్రం మాట్లాడతారు అని విమర్శించారు.

అవినాష్ రెడ్డి చిన్నవాడు అంట.. మంచోడు అంట. ఆయన భవిష్యత్ పాడు చేస్తున్నమట. అవినాష్ రెడ్డిని ఎంపీగా నిలబెట్టినప్పుడు మేము ఎదురు చెప్పలేదు. వివేకా వద్దు వద్దు అన్నా మేము కాదు అనలేదే. వివేకా హత్య రోజు మేము అవినాష్ రెడ్డి నిందితుడు అని చెప్పలేదు కదా. మాకు అవినాష్ రెడ్డి భవిష్యత్ పాడు చేసే అవసరం లేదు. ఎందుకు అవినాష్ రెడ్డిని నమ్ముతున్నారు గుడ్డిగా? మీకు దేవుడు ఇంగితం ఇవ్వలేదా? ఆలోచన శక్తి లేదా? CBI అన్ని ఆధారాలు చూపిస్తుంటే మీకు కనపడటం లేదా? మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. అధికారంలో లేనప్పుడు CBI దర్యాప్తు కావాలని అడిగారు. అధికారంలోకి వచ్చాక CBI దర్యాప్తు వద్దు అన్నారు. మామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు.. సాక్ష్యాలు తుడుస్తుంటే అవినాష్ నిలబడి చూశాడు అంటూ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.