షర్మిల నోట జై తెలంగాణ మాట..

  • IndiaGlitz, [Saturday,February 20 2021]

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారుతున్నారు. అన్ని జిల్లాల వైఎస్ అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ పెట్టే దిశగా ఆమె వడివడిగా అడుగులు వేస్తున్నారు. అందరినీ కలుపుకుంటూ వెళుతున్నారు. తాజాగా ఆమె తెలంగాణ సెంటిమెంటును కూడా వాడేస్తున్నారు. ఇప్పటికే తాను తెలంగాణ కోడలిననే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు షర్మిల సిద్ధమవుతున్నారు.

తనకు తెలంగాణలో పార్టీ పెట్టేందుకు పూర్తి హక్కు ఉందని.. తాను పుట్టింది ఏపీలో అయినా పెరిగిందంతా తెలంగాణలోనేనని.. పెళ్లి చేసుకున్నది కూడా తెలంగాణ వ్యక్తినేనని ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. షర్మిల నోట తాజాగా జై తెలంగాణ మాట వినిపించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా షర్మిల రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి సేవ చేశారని.. తెలుగు ప్రజలనందరినీ వైఎస్సార్ ప్రేమించారని షర్మిల తెలిపారు.

ప్రతి రైతు రాజు కావలని వైఎస్ అనుకున్నారని.. ప్రతి పేదవాడు లక్షాధికారి కావాలనుకున్నారని ఆమె వెల్లడించారు. ప్రతి పేద విద్యార్థి ఉచితంగా పెద్ద చదువులు చదువుకోవాలని అనుకున్నారని.. ప్రతి పేదవాడు ఎలాంటి అనారోగ్యం వచ్చినా భరోసాగా ఉండాలనుకున్నారని షర్మిల తెలిపారు. ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉందలనుకున్నారని షర్మిల పేర్కొన్నారు. మొత్తానికి తండ్రి సెంటిమెంటును వాడుకుంటూ షర్మిల.. వీలైనంత త్వరలో పార్టీని పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.