‘శివలింగం’ పేరుతో కోటీశ్వరులవ్వాలని కటకటాల్లోకి!
- IndiaGlitz, [Tuesday,August 06 2019]
మోసపోయేవాళ్లు ఉన్నన్ని రోజులు మోసం చేసేవాళ్లు ఉంటారనే పెద్దలు చెబుతూ ఉంటారు. దీన్నే కొందరు బాగా వంటబట్టించుకుని మోసం చేసి సొమ్ము చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా.. కృష్ణా జిల్లాలో రంగాచార్యులు, దిలీప్కుమార్, బాలాజీ, శ్రీనివాస్, సుధాకర్లు శివలింగం పేరుతో కోట్లు సంపాదించి కోటీశ్వరులైపోదామనుకుని చివరికి కటకటాలపాలయ్యారు.
శివలింగంలా ఉండే ఓ పచ్చరాయిని సేకరించి.. దీన్ని దేవుడిపై ఉన్న నమ్మకం ఉన్నవాళ్లు కొంటారంటూ రెండు కోట్ల రూపాయిలకు బేరం పెట్టారు. అంతేకాదు ఎక్కడా ఎవరికీ ఎలాంటి సందేహం రాకుండా జమాలజిస్ట్ పర్యవేక్షణలో జమ్ టెస్టింగ్ ల్యాబ్ హైదరాబాద్లో దీనిని పరీక్షించినట్లుగా ఓ తప్పుడు ధ్రువపత్రాన్ని కూడా సృష్టించారు. ఈ శివలింగం 4.4 కేజీల బరువు ఉందని ఆ సర్టిఫికెట్లో తేల్చారు. దీనిని ఎవరు దక్కించుకున్నా కోటీశ్వరులై పోతారని జనాలను నమ్మించడానికి ఓ పుకారు పుట్టించారు. విజయవాడ మొదలుకుని పలు ప్రాంతాల్లో దీన్ని వేలం వేయడానికి యత్నించగా.. వీళ్ల పాచికలు పారలేదు.
ఫైనల్గా సోమవారం సాయంత్రం విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఈ మిత్రులందరూ వేలం పాట పెట్టగా విషయం తెలుసుకున్నారు. దీనితో వీరి ఆటకట్టించాలని టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ముఠాను అదుపులోకి తీసుకుని.. ప్రత్యేకంగా పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇలాంటి ముఠాను ఎవరూ నమ్మొద్దని.. ఎవరైనా ఇలా చేస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు చెబుతున్నారు.