తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి జనసేన రె'ఢీ'
- IndiaGlitz, [Saturday,April 20 2019]
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన రె‘ఢీ’ అయ్యింది. ఈ మేరకు జనసేన తన అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ పోటీ విషయాన్ని స్పష్టం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కార్యకర్తలు, అభిమానులు కోరారు. దీంతో అభ్యర్థులను పోటీకి నిలపాలని జనసేన నిర్ణయించింది. 5857 ఎంపీటీసీ, 535 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు రానున్న నేపథ్యంలో శనివారం ఉదయం హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జనసేన తెలంగాణ ఇంచార్జ్ శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేందర్, శంకర్ గౌడ్లు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించారు. లోక్ సభ ఎన్నికల్లో మనం ఏడు స్థానాల్లో పోటీ చేశామన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ ఇందుకు భిన్నంగా ఉంటుందన్నారు. మన పార్టీకి యువత, మహిళలు బలమన్నారు.
కార్యకర్తలు మాట్లాడుతూ...జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ ఆలోచనా విధానం, పార్టీ ఏడు సిద్ధాంతాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో అవసరం. వాటిని గ్రామ స్థాయి నుంచి అమలు చేసేందుకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి. ఇందుకు అనుగుణంగా అధినేత తీసుకొనే
నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్తాం అన్నారు.