close
Choose your channels

Pawan Kalyan : ప్రశ్నిస్తే చాలు అట్రాసిటీ కేసే... ఇంత అడ్డగోలుగానా: జగన్ పాలనపై పవన్ నిప్పులు

Sunday, August 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వైసీపీ అడ్డగోలుగా ఉపయోగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా సమస్యలపై ప్రశ్నిస్తే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధిస్తోందని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం వేపనపల్లి గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జశ్వంత్ అనే యువకుడు ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే... అతనితోపాటు ఆయనకు అండగా ఉన్న మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్లు రాసి కేసులుపెట్టారని ఆయన ఆరోపించారు. సరైన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్ కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసి, రిమాండు రిపోర్టును రిజెక్టు చేశారని పవన్ చురకలు వేశారు. అయినప్పటికీ యువకులను ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని నాయకులు, పోలీసులు కసరత్తులు చేస్తున్నారని జనసేనాని ఆరోపించారు.

బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం :

ప్రజా ప్రతినిధికి కులం, మతం అనేది ఉండదని, కులాల ముసుగులో దాక్కోకూడదని పవన్ కల్యాణ్ హితవు పలికారు. నియోజకవర్గంలో పని చేయకపోతే ప్రజలు నిలదీస్తారని.. ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా అని జనసేనాని ప్రశ్నించారు. నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలిగానీ, అడ్డగోలుగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును ఉపయోగించి వేధిస్తారా అని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఈ యాక్ట్ ఎస్సీ, ఎస్టీలను రక్షించడానికి బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్ తీసుకొచ్చారు తప్ప... మిగతా కులాలను వేధించడానికి కాదని ఆయన గుర్తుచేశారు.

మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం:

ఇలా అకారణంగా వేధించడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని.. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును అడ్డగోలుగా ఉపయోగించడంపై లోతుగా అధ్యయనం చేసి, పార్టీ పి.ఏ.సి., సర్వ సభ్య సమావేశంలో చర్చిస్తామన్నారు. అకారణంగా పోలీసుల వేధింపులకు గురవుతున్న తొమ్మిది మంది యువకులకు చిత్తూరు జిల్లా జనసేన నాయకులు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.