close
Choose your channels

వనజీవి రామయ్యకు పవన్ పరామర్శ.. వీడియో కాల్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్న జనసేనాని

Monday, May 23, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ పర్యావరణ పరిరక్షకుడు, పద్మశ్రీ వనజీవి రామయ్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్‌లో పరామర్శించారు. రామయ్యకు వీడియో కాల్ చేసిన పవన్ కళ్యాణ్ ఆయన యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రామయ్య త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రామయ్య సంపూర్ణ ఆరోగ్యవంతులై పర్యావరణ పరిరక్షణకు పునరంకితం కావాలని అభిలషిస్తున్నానని పవన్ అన్నారు. పచ్చదనం కోసం ఆయన పడే తపన, చూపే శ్రద్ధ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిలిస్తాయని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా రామయ్య మనవడితో, వైద్య సేవలు అందిస్తోన్న డాక్టర్లతో పవన్ కళ్యాణ్ మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్ధితిని తెలుసుకున్నారు.

కాగా.. గత బుధవారం ఉదయం ఖమ్మం జిల్లా పల్లెగూడెంలో మొక్కలకు నీళ్లు పోసేందుకు రామయ్య తన వాహనంపై వెళ్తున్నారు. ఈ సమయంలోనే రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన మరో బైక్ రామయ్యను ఢీకొట్టింది. దీంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే స్పందించిన స్థానికులు ఆయనను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, 2019 మార్చిలో కూడా ఇలాగే రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఏడాది మార్చి 30న తన మనమరాలిని చూసి తన వాహనంపై‌ వెళ్తున్న రామయ్యను స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయనను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆయన త్వరగానే కోలుకున్నారు.

ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య. కోటి మొక్కలు నాటాలన్న లక్ష్యంతో పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన శ్రమిస్తున్నారు. తన ప్రయత్నంలో భాగంగానే ..ప్రతి చోట విత్తనాలు నాటుతూ, ప్రజలకు మొక్కలు పెంచడం వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ వస్తున్నారు. అంతరించిపోతున్న వృక్ష సంపదను పెంచడానికి రామయ్య చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనను అత్యున్నత పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మరోవైపు.. తనను ఢీకొట్టిన వాహనదారుడిపై కేసు నమోదు చేయొద్దని మంత్రులను రామయ్య కోరారు. కేసు పెట్టడానికి బదులుగా అతడితో వంద మొక్కలు నాటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రులు.. వంద కాదు, వెయ్యి మొక్కలు నాటుదామన్నారు. అలాగే తనకు సీఎం కేసీఆర్‌‌ను కలవాలని ఉందని.. అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరారు. మంత్రులు సానుకూలంగా స్పందించి.. పూర్తిగా కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక.. కేసీఆర్‌ను కలిసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.