close
Choose your channels

Janasena : జగన్ ఒక బకాసురుడు.. ఎంత అవినీతి సొమ్ము తిన్నా ఆకలి తీరదు: జనసేన నేత హరిప్రసాద్

Tuesday, June 21, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బకాసురుడు లాంటి వాడని, ఎంత అవినీతి సొమ్ము తిన్నా ఆయన ఆకలి తీరడం లేదంటూ దుయ్యబట్టారు జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షుడు డా.పి. హరిప్రసాద్ . సోమవారం తిరుపతిలో, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి కిరణ్ రాయల్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ లాంటి బకాసురుడికి బుద్ధి చెప్పే రోజు అతి దగ్గర్లోనే ఉందన్నారు. పవన్ కళ్యాణ్‌కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక కొంతమంది వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని హరిప్రసాద్ మండిపడ్డారు. పేర్ని నాని ఇంకా మంత్రి పదవి ఉందన్న భ్రమలో బతుకుతున్నారని.. ఆయన్ను, ఆయన మాటలను పట్టించుకునే వారు ఎవరూ లేరని విమర్శించారు.

మీ నాయకుడిని ఇంట్లో కూర్చోబెడతాం:

మిమ్మల్ని మీ నాయకుడు ఇంట్లో కూర్చోబెట్టినట్లే... మీ నాయకుడిని మేము ఇంట్లో కూర్చొబెట్టే రోజు దగ్గర్లోనే ఉందని హరిప్రసాద్ జోస్యం చెప్పారు. రైతే రాజు అని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి... ఈ రోజు రైతులను అప్పుల పాల్జేశారని ఆయన ఆరోపించారు. కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి... కేసులకు భయపడి సాష్టాంగ నమస్కారాలు చేశారంటూ సెటైర్లు వేశారు. చెత్తపై పన్ను విధించిన చెత్త పుత్రుడు ఈ ముఖ్యమంత్రి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 15కు పడిపోవడం గ్యారెంటీ అని హరిప్రసాద్ జోస్యం చెప్పారు .

టికెట్ రాదన్న భయంతోనే పవన్‌పై పేర్నినాని విమర్శలు:

కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విలువ లేని మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మాజీ మంత్రి పేర్ని నానినే అంటూ విమర్శలు గుప్పించారు. ఆయనకు సొంత పార్టీలో విలువ లేదు... సొంత ఊరిలో విలువ లేదు... భార్య, బిడ్డల దగ్గరా విలువ లేదని చురకలు వేశారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందంటూ కిరణ్ ఎద్దేవా చేశారు. ఆయన్ను సొంత పార్టీ వాడుకొని వదిలేసినా, మంత్రి పదవి పీకేసినా ఇంకా పదవి ఉందన్న భ్రమలో బతుకుతున్నారంటూ సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదన్న భయంతో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారని కిరణ్ మండిపడ్డారు. ఖబడ్డార్... నాని, మీరు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు పేలితే తాము మీ ఇంట్లో విషయాలను బయటకు తీయాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మీ సుపుత్రుడి అరాచకాలు ఎక్కువైపోతున్నాయని మీ నియోజకవర్గంలో వినిపిస్తోందని.. వాటన్నింటిని బయటకు తీస్తామని కిరణ్ వార్నింగ్ ఇచ్చారు.

సింహాన్ని బోనులో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి :

జనసేన పార్టీకి దమ్ముంటే సింగిల్ గా రావాలని కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన సింగిల్‌గా వస్తుందా? పొత్తులు పెట్టుకుంటుందా? అనేది మా నాయకుడు నిర్ణయిస్తాడని ఆయన చెప్పారు. ఎవరు ఎలా వచ్చినా మా నాయకుడు సింహం సింగిల్ గానే వస్తాడు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారని.. కానీ మీ సింహాన్ని బోనులో పెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ కిరణ్ జోస్యం చెప్పారు. దమ్ముంటే ప్రత్యేక హోదా తీసుకురండి అని నాని మాట్లాడుతున్నారని... మేము ప్రత్యేక హోదా తీసుకొస్తే 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గెలిచింది మా ఇళ్లల్లో పాచిపని చేయడానికా అని కిరణ్ ప్రశ్నించారు. మేము గాజులు వేసుకొని, చీరలు కట్టుకున్న తేడాగాళ్లమని మీరు ఒప్పుకుంటే మా నాయకుడు కేంద్రంతో మాట్లాడి ప్రత్యేక హోదా తీసుకురావడానికి ప్రయత్నిస్తారని ఆయన తెలిపారు.

ప్రజాక్షేత్రంలోనే చూసుకుంటాం:

వైసీపీ నాయకుల్లా మా నాయకుడికి సిమెంటు ఫ్యాక్టరీలు లేవని, ల్యాండ్, సాండ్ మాఫియాలు లేవని కిరణ్ తెలిపారు. అయినా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చనిపోయిన 3 వేల మంది కౌలు రైతులకు ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చారని ఆయన ప్రశంసించారు. ఇప్పటికే 272 మందికి సాయం అందించారని.. వచ్చే నెలలో కడపలో మరో 132 మందికి సాయం అందిస్తారని కిరణ్ స్పష్టం చేశారు. దసరా తరువాత జనసేనాని రాష్ట్ర వ్యాప్త పర్యటన ప్రారంభమవుతుందని.. మీరు చేసిన అరాచకాలను ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని కిరణ్ హెచ్చరించారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.