close
Choose your channels

అంతా జగన్నాటకం.. సజ్జల, ప్రశాంత్ కిషోర్‌ డైరెక్షన్‌లోనే కుట్ర: జనసేన నేత కిరణ్ రాయల్

Friday, May 27, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎస్సీ సోదరులు జనసేన వైపు ఉన్నారన్న అక్కసుతోనే అమలాపురంలో వైసీపీ ప్రభుత్వం కోనసీమ అల్లర్లకు తెర తీసిందని జనసేన పార్టీ తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అల్లర్ల వెనక ఎవరు ఉన్నారో జనానికి తెలిసిపోయిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీల మీద జరుగుతున్న మర్డర్లు, మానభంగాలు, హత్యాచారాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే వైసీపీ ప్రభుత్వం కోనసీమ అల్లర్లకు కుట్ర పన్నిందని కిరణ్ ఆరోపించారు. డైవర్షన్ చేసే సీఎంగా పేరు తెచ్చుకున్న జగన్.. కులాల మధ్య చిచ్చు పెట్టడానికి అంబేద్కర్ పేరును వాడుకున్నారని దుయ్యబట్టారు. అమలాపురం ఘటనలో నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ జరిపించాలని కిరణ్ డిమాండ్ చేశారు.

అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు అగ్రవర్ణాల ప్రజలు సంతోషించారని.. కులాలను రెచ్చగొట్టి తద్వారా లబ్ది పొందేందుకు వైసీపీ ప్రభుత్వం కోనసీమ డ్రామాను తెర మీదకు తెచ్చిందని కిరణ్ ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు తమ ఇళ్ళ మీద తామే దాడి చేయించుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు పేర్లు పెట్టినప్పుడు ప్రజల నుంచి ఎన్నో డిమాండ్లు వచ్చాయని.. కోనసీమ ప్రాంతానికి డాక్టర్ అంబేద్కర్ పేరు పెట్టాలనే విజ్ఞప్తిని జిల్లాల పునర్విభజన ప్రకటన సమయంలో ప్రభుత్వం పట్టించుకోలేదని కిరణ్ రాయల్ గుర్తుచేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం జగన్నాటకం ఆడుతూ జనాన్ని రెచ్చగొట్టిందని ఆయన ఆరోపించారు.

దాడులకు కారకులెవరో రాష్ట్రం మొత్తం తెలుసు:

అమలాపురంలో దాడులకు పాల్పడింది, పురిగొల్పింది ఎవరో రాష్ట్రం మొత్తానికి తెలుసునని కిరణ్ అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలు, మంత్రి విశ్వరూప్ ప్రకటనలే అందుకు నిదర్శనమన్నారు. స్వయంగా మంత్రే తమ కౌన్సిలర్ ప్రమేయం ఉందని ఒప్పుకున్నారని కిరణ్ గుర్తుచేశారు. ఈ తరహా దాడులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రశాంతి కిషోర్‌ల డైరెక్షన్‌లో జరుగుతున్నాయని కిరణ్ ఆరోపించారు. ఇప్పుడు దాన్ని జనసేన పార్టీ మీదకు నెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అల్లర్లు చేసిన నిజమైన నింధితులు ఎవరో తేల్చాలన్న చిత్తశుద్ది ఉంటే ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు.

కడపకు వై.ఎస్.ఆర్. బదులు అంబేద్కర్ పేరు పెట్టాలి:

అంబేద్కర్ మీద ముఖ్యమంత్రికి నిజంగా ప్రేమ ఉంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటో తీసేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో పట్టుకుని ఎన్నికలకు వెళ్లే దమ్ము మీకుందా అని కిరణ్ ప్రశ్నించారు. మీ పథకాలకు ఆయన పేరు పెట్టే సత్తా మీకుందా అని ఆయన నిలదీశారు. కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెట్టారని... ఆ స్థానంలో అంబేద్కర్ పేరు పెట్టాలని, లేనిపక్షంలో 27వ జిల్లాగా పులివెందుల చేసి... భీమ్ రావు జిల్లా అని ప్రకటించాలని కిరణ్ డిమాండ్ చేశారు.

రోజాకు ఇదే చివరి పదవి.. తర్వాత ఇంటికే:

సెలబ్రెటీ హోదాలో ఉన్న తమ నాయకుడితో దిగిన ఫోటోను అడ్డు పెట్టుకుని మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు జనసేన పార్టీపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీ మంత్రి రోజాకు ఇదే చివరి పదవి అని ఎన్నికల తర్వాత ఇంటికి పరిమితం కాక తప్పదని కిరణ్ జోస్యం చెప్పారు. ఫ్యాన్ గుర్తుకు ప్రజలు ఓట్లు వేస్తే.. కరెంటు కోతలతో ఆ ఫ్యాన్ గాలి కూడా అందడం లేదని ఆయన సెటైర్లు వేశారు. నిత్యం సమస్యలతో ప్రజలు ధర్నాలు, నిరసనలు చేస్తుంటే హౌస్ అరెస్టులు నిత్యకృత్యంగా మారాయని కిరణ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.