close
Choose your channels

నోటికొచ్చినట్లు హామీలు .. అడిగితే కక్ష సాధింపులు, ఇదీ సీబీఐ దత్తపుత్రుడి తీరు: జగన్‌పై నాదెండ్ల ఫైర్

Saturday, May 14, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. నోటికొచ్చిన అబద్దాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడుకి తెలిసిన విద్య అంటూ ఆయన దుయ్యబట్టారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందన్న నాదెండ్ల.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు ఎగ్గొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం అని ఊరూరా మద్యం పారిస్తున్నారని... సీపీఎస్ రద్దుపై మాట తప్పారని మనోహర్ ఎద్దేవా చేశారు. మల్లాడి సత్యలింగం నాయకర్ పేరు పలికే అర్హత సీఎంకి లేదని... ఎం.ఎస్.ఎన్.ఛారిటీస్ ఆస్తులు వైసీపీ నేతలు కబ్జా చేస్తున్న విషయం ఆయనకు తెలియదా నాదెండ్ల ప్రశ్నించారు.

గడప గడపలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారని.. పరిపాలన చేతగాని సీబీఐ దత్తపుత్రుడిలో ఆందోళన మొదలైందని చురకలు వేశారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్పడమే జగనుకు తెలిసిన విద్య అని.. పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించారని మనోహర్ ధ్వజమెత్తారు. మేనిఫెస్టోలో ఎడాపెడా చెప్పేసి.. తీరా వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని.. పైగా 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారన్నారు.

రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని కూడా ఎందుకు పథకానికి దూరం చేశారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 2021లో లక్షా 19వేల మందికి ఇస్తున్నామని చెప్పారని.. 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించారని ఆయన ఎద్దేవా చేశారు. జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

వైసీపీలో మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలని.. ఊరూరా మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. ప్రతి యేటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారని.. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్ అదీ అరకొర ఉద్యోగాలని వాటికి ఇప్పటికీ నోటిఫికేషన్లు లేవని నాదెండ్ల ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం తీసుకొస్తామని మాట తప్పారని.. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని అంగీకరించారంటూ సెటైర్లు వేశారు . పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూడటం లేదని.. వైసీపీ దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారని.. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్ళెదుట కనిపిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారని మనోహర్ చురకలు వేశారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైందన్నారు. సీబీఐ దత్తపుత్రుడు, ఆయన అనుచరులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని.. చేతనైతే బాధల్లో ఉన్న రైతాంగం కన్నీరు తుడవాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.