close
Choose your channels

ఆ 200 మంది కౌలు రైతులే .. పోలీస్ రికార్డుల్ని చెక్ చేసుకోండి : జగన్‌కు నాదెండ్ల చురకలు

Monday, May 16, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మండిపడ్డారు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రైతులను మోసం చేయడంలో సి.బి.ఐ. దత్తపుత్రుడు జగన్ రెడ్డిని మించినవాళ్లు ఉండరని ఫైరయ్యారు. వాస్తవంగా వైసీపీ చెప్పిన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధులకు కేంద్ర ప్రభుత్వం నిధులు కలుపుకొంటే ప్రతి రైతుకు రూ.19,500 రావాలని.. కానీ ఇస్తున్నది రూ.13,500 మాత్రమేనని నాదెండ్ల అన్నారు. దీనిని బట్టి ఒక్కో రైతు మీదా రూ.6 వేలను జగన్ ప్రభుత్వం మిగుల్చుకొంటోందని నాదెండ్ల ఆరోపించారు.

రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా వున్న జగన్ రెడ్డి తాను రైతు బిడ్డనని చెప్పుకొంటున్నారని ఆయన మండిపడ్డారు. ఆయన చంచల్ గూడ బిడ్డ అని అందరికీ తెలుసునని నాదెండ్ల సెటైర్లు వేశారు. ఈ రోజు గణపవరంలో ముఖ్యమంత్రి హోదాలో సి.బి.ఐ. దత్తపుత్రుడు చేసిన ప్రసంగం తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రపై అక్కసు వెళ్లగక్కడానికే సరిపోయిందన్నారు. పరిహారం అందని ఒక్క రైతు కుటుంబాన్నీ చూపలేకపోయారనడం ముఖ్యమంత్రి అవగాహనరాహిత్యాన్ని వెల్లడిస్తోందని మనోహర్ దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్ ... అనంతపురం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో పర్యటించి 200 కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారని నాదెండ్ల గుర్తుచేశారు. ఈ 200 మంది కౌలు రైతులు కాదు అని జగన్ రెడ్డి చెప్పగలరా అని మనోహర్ ప్రశ్నించారు. పోలీసు రికార్డుల్లో దీని గురించి స్పష్టంగా రాశారని.. కౌలుకి భూమి తీసుకొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 102, 43లకు అనుగుణంగా ఎందుకు రూ.7 లక్షలు ఇవ్వడం లేదని నాదెండ్ల ప్రశ్నించారు.

మెజారిటీ కేసుల్లో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాల దగ్గరకు వెళ్ళడం లేదన్నారు. కొన్ని కుటుంబాలను త్రిసభ్య కమిటీ కూడా విచారించిందని.. వారికి కేవలం రూ.లక్ష పరిహారం ఇచ్చి సరిపెట్టారని మనోహర్ దుయ్యబట్టారు. కౌలు రైతు కాని పక్షంలో అధికారులు వెళ్ళడం, కంటి తుడుపుగా పరిహారం ఇవ్వడం చేయరు కదా అంటూ ఎద్దేవా చేశారు. తాము ఆర్థిక సాయం చేసినవారికి సంబంధించిన వివరాలు, పోలీసు రికార్డుల్లో ఏం రాశారో చూపిస్తామని.. అప్పుడు సిబిఐ దత్తపుత్రుడు ముఖం ఎక్కడ పెట్టుకొంటారని నాదెండ్ల నిలదీశారు.

వైసీపీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ఎలాంటి ప్రణాళిక లేకుండా, రైతు శ్రేయస్సు పట్టించుకోకుండా చేస్తున్న పరిపాలన వల్ల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టం- కౌలుకి వ్యవసాయం చేసుకొనే పేదలకు రుణాలు కూడా రాకుండా చేస్తోందన్నారు. కౌలు రైతులకు ఇచ్చే అర్హత కార్డులు కూడా రాకుండా చేస్తున్నారని... ఫలితంగా వారికి బ్యాంకులు రుణాలు, పంట నష్ట పరిహారం, బీమా ఏవీ వర్తించడం లేదని నాదెండ్ల తెలిపారు. రైతులను కులాలవారీగా విభజించి లబ్ధి అందించాలనే ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే – అది వైసీపీ ప్రభుత్వమేనని మనోహర్ దెబ్బిపొడిచారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రభుత్వ నిధుల నుంచి రూ.7 లక్షలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి బాధపడిపోతున్నారని.. పవన్ కళ్యాణ్ తన కష్టార్జితం నుంచి ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఇస్తున్నారని నాదెండ్ల ప్రశంసించారు.

జగన్ రెడ్డికి రైతులపట్ల చిత్తశుద్ధి ఉంటే కుత్సిత ఆలోచనతో రైతులను కులాలవారీగా విభజిస్తూ తీసుకువచ్చిన నిబంధనను తొలగించాలని మనోహర్ డిమాండ్ చేశారు. ప్రతి కౌలు రైతుకీ రైతు భరోసా వర్తింపచేయాలని.. అలాగే ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబానికీ రూ.7 లక్షల ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.