close
Choose your channels

nadendla manohar: వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం.. తాగునీటి కోసం 8 లక్షల మంది కటకట: నాదెండ్ల మనోహర్

Thursday, June 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. పోలవరంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్మించిన సురక్షిత మంచి నీటి పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నీరుగార్చిందని ఆయన ఆరోపించారు. దీని కారణంగా ఏజెన్సీ గ్రామాలు, మెట్ట ప్రాంతాల వారికీ శుద్ధి చేసిన జలాలు అందకుండాపోయాయని నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పథకం నిర్వహణకు నిధులు ఇవ్వకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని ఆయన ఆరోపించారు.

160 మంది ఉద్యోగులకు జీతాలు లేవు:

ఏలూరు జిల్లాలో 250 గ్రామాల్లో 8 లక్షల మందికి రక్షిత మంచి నీరు సరఫరా చేసేలా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దిందని నాదెండ్ల మనోహర్ గుర్తుచేశారు. ఏటా నిర్వహణకు నిధులు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసిందని.. ఇందులో పనిచేసే 160 మంది ఉద్యోగులకు గత 18 నెలలుగా జీతాలు కూడా అందటం లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ సమస్యను పరిష్కరించి ప్రజలకు సురక్షిత తాగు నీరు అందించాలని జనసేన నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని నాదెండ్ల విమర్శించారు.

కావాలనే ఈ ప్రాజెక్ట్‌ని నాశనం చేశారా:

ఇవన్నీ చూస్తుంటే ఉద్దేశపూర్వకంగానే ఈ పథకాన్ని పని చేయకుండా చేస్తున్నారేమోనని అనిపిస్తోందని ఆయన ఆరోపించారు. సత్యసాయి బాబా బోధించిన సేవా ధర్మాన్ని పాలకులు విస్మరించారని నాదెండ్ల ధ్వజమెత్తారు. లక్షలమంది భక్తులను కదిలించిన ఆయన సేవా స్ఫూర్తి పాలకుల్లో లేకపోవడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ పథకానికి నిర్వహణా నిధులు మంజూరు చేసి 8 లక్షల మందికి తాగు నీరు అందించాలని వైసీపీ ప్రభుత్వాన్ని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.