close
Choose your channels

Pawan Kalyan:ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు.. కానీ : పొత్తులపై పవన్ క్లారిటీ

Friday, January 13, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాన్ ఒంటరిగా పోటీ చేస్తారా లేక టీడీపీతో పొత్తుతో వెళ్తారా అన్న దానిపై గత కొన్నిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేనాని భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం గురువారం జరిగిన యువశక్తి బహిరంగ సభలో పొత్తుకు సంబంధించి పవన్ క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదని.. తన గౌరవం తగ్గకుంటడా వుంటే పొత్తుల్లో ముందుకే వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. కుదరని పక్షంలో ఒంటరిగానే పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒంటరిగా వెళ్లే ధైర్యం ఇస్తే ఖచ్చితంగా అలాగే బరిలోకి దిగుతానని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నా వెంటే వున్నామని అంటారని.. తీరా ఎన్నికల సమయానికి కులమని, మతమని, అమ్మ, నాన్న చెప్పారని ఓటు వేరేవారికి వేస్తారని పవన్ తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

గత ఎన్నికల్లో 53 నియోజకవర్గాల్లో వైసీపీ టెక్నికల్‌గానే గెలిచిందని.. జనసేనకు అప్పట్లో 7 శాతం వరకు ఓట్లు పడ్డాయని పవన్ తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనని.. తనకు రాష్ట్రం బాగుండటమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం మంచి పాలన అందించి వుంటే తాను గొంతెత్తేవాడిని కాదని, కానీ బాధపెడుతుంటే ఖచ్చితంగా ఎదురు తిరుగుతామని పవన్ పేర్కొన్నారు. గతంలో టీడీపీని తిట్టి.. ఇప్పుడు మళ్లీ కలుస్తారా అని కొందరు అంటున్నారని.. కానీ ఒక హింసించే వ్యక్తిని ఎదుర్కోవాలంటే అందరు కలవాలని ఆయన అన్నారు.

రోజాపై ఘాటు వ్యాఖ్యలు:

ప్రజల కోసం ప్రతి వెధవ, సన్నాసితోనూ తాను మాటలు పడుతున్నానని పవన్ వ్యాఖ్యానించారు. డైమండ్ రాణి రోజా కూడా తనపై మాట్లాడుతున్నారని.. మీ కోసం డైమండ్ రాణిలతో కూడా తిట్టించుకుంటున్నానని ఆయన అన్నారు. రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయానని చేసిన విమర్శల విషయంలో తాను బాధపడలేదని పవన్ పేర్కొన్నారు. తన చివరి శ్వాస వరకు రాజకీయాల్లోనే వుంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీని నడిపే స్థాయిలో డబ్బు వుంటే సినిమాలు చేయాల్సిన అవసరం లేదని పవన్ పేర్కొన్నారు.

మూడు ముక్కల సీఎం, ఖైదీ నెంబర్ 6093

మూడు ముక్కల ముఖ్యమంత్రి, మూడు ముక్కల ప్రభుత్వం అన్న పవన్.. జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివారని అన్నారు. ఆయన స్నేహితులు తనకు తెలుసునని, జగన్ ఎలాంటి వాడో తెలుసునని.. వ్యక్తిగతంగా వెళితే తాను మాట్లాడాల్సి వస్తుందన్నారు. సలహాలు ఇచ్చేవాడు సజ్జల అయితే మూడు ముక్కల ముఖ్యమంత్రికి అన్ని పనికిమాలిన ఆలోచలనే వస్తాయని పవన్ దుయ్యబట్టారు. జైలుకు వెళ్లిన ఖైదీ నెం 6093 కూడా తనను విమర్శిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. డీజీపీ ఒక ఖైదీకి సెల్యూట్ కొడుతున్నారని.. ఏమైనా అంటే కాపులు తనను నమ్మొద్దని వాగుతున్నారని పవన్ ఎద్దేవా చేశారు. తనను మళ్లీ ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానని.. రాజకీయాల్లో ఎవరూ ఫుల్‌టైమ పొలిటీషియన్ వుండరని ఆయన పేర్కొన్నారు. నీ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్నానని.. నువ్వెంత అంటూ జగన్‌ను పవన్ ప్రశ్నించారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా..విడాకులు ఇచ్చే చేసుకున్నానని ఆయన స్పష్టం చేశారు.

సంబరాల రాంబాబు, సన్నాసి ఐటీ మంత్రి :

తాను చంద్రబాబుతో రెండున్నర గంటల పాటు ఏం మాట్లాడోనని వైసీపీ నేతలు అడుగున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం చూసే సంబరాలు రాంబాబు, సన్నాసి ఐటీ మంత్రి గురించి మాట్లాడుకున్నామంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు బాబుతో బేరాలు కుదిరిపోయాయని అంటున్నారని.. తనకు డబ్బుపై ఆశ లేదని, రూ.25 కోట్లు ట్యాక్స్ కడుతున్నానని ఆయన చెప్పారు. తాను తలచుకుంటే ఏడాదికి రూ.250 కోట్లు సంపాదించగలనని పవన్ తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.