close
Choose your channels

Janasena Party : ఏపీకి వైసీపీ హానికరం.. ముద్దులు పెట్టేవాళ్లని నమ్మొద్దు : జనవాణిలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Monday, July 4, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో జరిగిన జనవాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. పేదలపై మీ ప్రేమలు, అభిమానాలు వద్దని హితవు పలికారు. వారి కోసం ఉద్దేశించిన, వారి హక్కులకు సంబంధించిన చట్టాలను, రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చాలన్నారు. మీ ముద్దులు, అక్కున
చేర్చుకోవడాలు వద్దని జగన్ పై సెటైర్లు వేశారు.

ముద్దులు పెట్టేవాళ్లని నమ్మొద్దు:

పదేపదే ముద్దులు పెట్టుకొనేవాళ్లను నమ్మోద్దని.. మన పొరుగున ఉన్న శ్రీలంక పరిస్థితికి కారణం అక్కడ వనరులు లోపం కాదని, నాయకత్వ లోపమని పవన్ తెలిపారు. మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉందని జనసేనానిని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి వనరులు ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నదానిపైనే దృష్టి పెడుతుంది తప్ప.. ప్రజా సమస్యలు తీర్చడానికి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలి? ఓటర్లను తిమ్మిని బమ్మి చేసి మన వైపు ఎలా తిప్పుకోవాలి అన్న కాంక్ష తప్ప, ఏ ప్రజా ప్రయోజనం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు.

నేనేమీ అద్భుతాలు చేయను:

నాకు ఒక అర్జీ ఇవ్వగానే అది పరిష్కారం అవుతుందని చాలామంది అనుకుంటారని... అది ప్రజలకు తనపై ఉన్న నమ్మకమన్నారు. తాను వెంటనే అద్భుతాలు చేసేస్తాను.. అన్ని పరిష్కరిస్తాను అని చెప్పడం లేదని, కచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలను పదిమంది దృష్టికి తీసుకువెళ్లేలా ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. ఆ సమస్య విస్తృతం అయ్యేలా చూస్తానని... దీనివల్ల ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతుందని పవన్ తెలిపారు. దీంతోపాటు అధికారులు కచ్చితంగా ఈ సమస్యలు పరిష్కరించేలా ప్రత్యేక ఫాలో అప్ ఉంటుందని.. ఆ ప్రక్రియను విశ్రాంత ఐఏఎస్ అధికారి, జనసేన నాయకులు వర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఒక బాధ్యతతో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారమయ్యేలా మాత్రం చూస్తామన్నారు. వైసీపీ నాయకులు పూర్తిగా క్రిమినల్స్ ను వెనకేసుకొచ్చే పనిలో పడ్డారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

క్రిమినల్స్ ను వైసీపీ వెనకేసుకొస్తోంది:

ఈ రోజు వచ్చిన ఓ అర్జీలో ఐదేళ్ల బిడ్డ జీవితం పాడు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడిపై ఇప్పటివరకు కేసు పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగించిందని పవన్ వ్యాఖ్యానించారు. కనీసం ఇచ్చిన ఫిర్యాదును తీసుకోకపోవడం మరీ విచిత్రమని.. క్రిమినల్స్ ను వేనకేసుకొస్తున్న ఈ పాలకులను చూస్తే మనకు ఎందుకు కోపం రావడం లేదని ఆయన ప్రశ్నించారు. మనలో ధైర్యం లేక గూండాలకు, దగాకోరులకు భయపడుతున్నారా? ఈ పద్ధతిని కచ్చితంగా జనసేన బ్రేక్ చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే బలంగా లా అండ్ ఆర్డర్ ను అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తప్పు చేసిన వాడి తోలు తీసేలా శాంతిభద్రతలు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో రాక్షస పాలన:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైసీపీ హానికరం అన్నమాట నేను ఎప్పుడో చెప్పానని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంని.. దీని నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. బలమైన భావజాల సమూహం ఉన్న నాయకులంతా కలిస్తేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు పునర్వైభవం వస్తుందని ఆయన స్పష్టం చేశారు. సమస్యల్లో ఉన్న ప్రజల కోసం నిలబడాలని.. కచ్చితంగా మనకు ఓటు అడిగే హక్కు వస్తుందని, నిరంతరం ప్రజలతో మమేకమై పని చేసుకొని వెళ్లడానికి అంతా సిద్ధమై ఉందామని జనసైనికులకు పవన్ దిశానిర్దేశం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.