జీహెచ్ఎంసీ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన జనసేన..

  • IndiaGlitz, [Wednesday,November 18 2020]

జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నట్టు మంగళవారం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పార్టీ నుంచి పోటీ చేయబోయే వ్యక్తులకు సహాయ సహకారాలు అందించేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దీని కోసం ఒక హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు జనసేన కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేసే అభ్యర్థులకు సహకారం అందించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటయింది. నేటి నుంచి హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని జనసేన కార్యాలయంలో పనిచేసే ఈ హెల్ప్ డెస్క్- నామినేషన్ పత్రాల రూపకల్పనలో అభ్యర్థులకు సహాయ సహకారాలు అందిస్తుంది’’ అని జనసేన పార్టీ వెల్లడించింది.

కాగా.. నిన్న పవన్ విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయాలని యువ కార్యకర్తల విజ్ఞప్తి మేరకు నిర్ణయించాం. తెలంగాణ రాష్ట్రంలోనూ, జీహెచ్ఎంసీ పరిధిలోనూ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు ప్రశంసలు, విజ్ఞప్తులు వచ్చాయి. వారి వినతి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, వారి పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.

నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు. జీహెచ్ఎంసీలోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ.. ఇప్పటికే ప్రజల పక్షాన నిలిచాయి. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది’’ అని వెల్లడించారు.