ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై జనసేన రియాక్షన్..
- IndiaGlitz, [Monday,May 20 2019]
దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఫలితాలు వెల్లడించాయి. ఏపీ విషయానికొస్తే జాతీయ మీడియా సర్వేలన్నీ వైసీపీ గెలుస్తుందని చెప్పగా.. ప్రాంతీయ మీడియాల్లో లగడపాటి, ఎలైట్ సర్వేల్లో మాత్రమే టీడీపీ గెలుస్తుందని తేలింది. అయితే ఈ రెండింటి గురించి సర్వే సంస్థలు జనసేన పార్టీని మాత్రం పట్టించుకోలేదు. దీంతో జనసేనకు అంత సీన్ లేదని తేలిపోయింది.. అంతేకాదు ఒకే ఒక్క సీటు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే సంస్థలు తేల్చేశాయి. ఈ సర్వే చూసిన పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నైరాశ్యంలో పడిపోయారు.. మరోవైపు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం తీవ్ర అసంతృప్తితో రగిలిపోయినట్లుగా తెలిసిందే.
23 వరకు వేచి చూద్దాం!
అయితే తాజాగా ఈ సర్వేల వ్యవహారంపై జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మి నారాయణ స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ను జనసేన పట్టించుకోదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచినా.. ఓడినా నిత్యం ప్రజాసేవలోనే ఉంటానని ఈ సందర్భంగా మాజీ జేడీ స్పష్టంచేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23వరకు వేచి చూడాలని ఆయన కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
ప్రజల కోసం ముందుకెళ్తాం!
ఎగ్జిట్ పోల్స్తో జనసేన పార్టీకి ఎలాంటి ఆందోళన లేదని.. అనవసరంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చి ప్రజల్లో మరింత ఉత్కంఠ కల్గిస్తున్నారని చెప్పుకొచ్చారు. కాస్త ఓపికతో ఉంటే ఈ నెల 23న అసలు ఫలితమే వచ్చేస్తుందని.. ఏ ఫలితం వచ్చినా ప్రజా సమస్యలపై పోరాడాలని మా పార్టీ నిర్ణయించిందని.. గెలుపోటములు సహజమన్నారు. ప్రజల కోసం పనిచేయాలన్న భావనతో మేం ముందుకెళ్తున్నామని.. అందువల్ల ఎగ్జిట్ పోల్స్ వల్ల కలిగే ప్రభావం మాపై ఏమీ కనబడటంలేదని మాజీ జేడీ చెప్పుకొచ్చారు.
మొత్తానికి చూస్తే.. లక్ష్మీనారాయణ మాటలను బట్టి ఓటమి కొట్టొచ్చినట్లు.. జనసేనలో ఎందుకు చేరానబ్బా..? అనే ఫీలింగ్ కనిపిస్తోందని నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. సో.. ఎవరి సత్తా ఏంటో తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.